ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ముగిసింది. అబుధాబిలో జరిగిన ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలూ కలిపి ఏకంగా రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంచుకోగా, ఇందులో 29 మంది విదేశీయులు ఉన్నారు. అయితే, ఈసారి వేలంలో కొన్ని వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. అనుకున్నవారికి నిరాశ, అన్ సోల్డ్ అవుతారనుకున్నవారికి జాక్ పాట్ తగిలింది! అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ల 'మెగా' మోత! .. ఈసారి వేలంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం... అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడకపోయిన) ఆల్‌రౌండర్లు చరిత్ర సృష్టించడం! ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ అనే ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.20 కోట్ల చొప్పున వెచ్చించి సొంతం చేసుకుంది.


ఐపీఎల్ లీగ్ చరిత్రలో ఒక అన్‌క్యాప్డ్ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం. జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లు ఇంత భారీ మొత్తాన్ని పలకడం... దేశవాళీ క్రికెట్ ప్రతిభకు దక్కిన అతి పెద్ద గౌరవం! రికార్డ్ ధరలు: కామెరూన్ గ్రీన్ నయా బాద్‌షా! .. అందరూ ఊహించినట్టే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్కు రికార్డు ధర దక్కింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.25.20 కోట్ల భారీ ధరకు తీసుకుంది. ఐపీఎల్‌లో ఇది మూడో అత్యధిక ధరకు చేరింది. మరోవైపు, శ్రీలంక పేసర్ మతీశ పతిరన (జూనియర్ మలింగ) కూడా జాక్ పాట్ కొట్టాడు. అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.



అన్ సోల్డ్ నుంచి 'సెన్సేషన్' వరకు! .. అన్ సోల్డ్గా మిగిలిపోతారని భావించిన కొందరు స్టార్లకు రెండో రౌండ్‌లో భారీ ధరలు దక్కాయి. ఇంగ్లండ్ విధ్వంసక బ్యాటర్ లివింగ్‌స్టోన్ మొదట అన్ సోల్డ్‌గా మిగిలిపోయినా, మళ్లీ వేలంలోకి రాగా సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లకు పాడుకుంది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ను రూ.8.60 కోట్లకు లక్నో దక్కించుకుంది. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ మొదట అన్ సోల్డ్ అయినా, రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అయితే, ఒకనాటి భారత దేశవాళీ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా ఇద్దరూ కనీస ధర రూ.75 లక్షలకే అమ్ముడుపోవడం... ఈ వేలంలో చోటుచేసుకున్న మరో వింత. మొత్తానికి, ఐపీఎల్-19 మినీ వేలం కొత్త తారలకు మాస్ ఎంట్రీ ఇచ్చి, రికార్డులతో మోత మోగించింది!

మరింత సమాచారం తెలుసుకోండి: