రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. రోడ్డుపై నిర్లక్ష్యంగా, అడ్డూ అదుపు లేకుండా ప్రయాణిస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా..రోడ్డు ప్రమాదాలు ఆగకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే ప్రతీ 86 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే జరుగుతున్నాయి. అయితే మందుకొట్టి వాహనం నడపాలనుకుంటే ఇక నో ఛాన్స్. ఎందుకంటే మద్యం సేవిస్తే ఆ వాహనం అసలు స్టార్టే కాదు. అసలు విషయంలోకి వెళ్తే.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను నిత్యం చూస్తూనే ఉంటాం.
అయితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త వ్యవస్థను కనిపెట్టారు ఓ ఇండియన్ ఆర్మీ అధికారి. ఈ విధానంలో డ్రైవర్ గనక మద్యం సేవించి ట్రక్కు నడిపితే అది స్టార్ట్ అవ్వదు. అంతే కాదు.. సీటు బెల్ట్ ధరించకపోయినా బండి కదలదు. కెప్టెన్ ఓంకార్ కాలే, అతని బృందం ఈ ఇంటిగ్రెటేడ్ వెహికల్ సేఫ్టీ సిస్టమ్ను రూపొందించింది. అలాగే డ్రైవర్ తాగి ఉన్నా, ఫోన్ లో మాట్లాడినా వాహనం స్పీడ్ తగ్గిపోతుంది. ఇక ఇంటిగ్రెటేడ్ వెహికల్ సేఫ్టీ సిస్టమ్ను తొలిసారిగా భారతీయ సైన్యానికి చెందిన జబల్పూర్ వెహికిల్ ఫ్యాక్టరీలో రూపొందించిన వాహనాలపై ప్రయోగించారు.
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కెప్టెన్ ఓంకార్ కాలే బృందాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు అభినందించారు. దీనివల్ల ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కాగా, 2018లో మత్తులో ఉండే డ్రైవర్లను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ పరిశోధకులు కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు. తాగినపుడు డ్రైవింగ్ చేస్తే వాహనం కదలకుండా ఉండేలా రూపొందించారు. వ్యర్థ పదార్థాలు, గ్రాఫెన్తో ఓ పరికరాన్ని తయారు చేశారు. ఎసెటిక్ యాసిడ్లోకి ఇథైల్ ఆల్కహాల్ పంపడం ద్వారా ఇది పనిచేస్తుంది.