ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ అంతటా గత నెల రోజులుగా లాక్డౌన్ అమలు అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినా ఏపీ ప్రజలను రాష్ట్రానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు జగన్ ప్రయత్నంతో ఎట్టకేలకు ఏపీకి చేరుకున్నారు. ఏపీకి చెందిన 4500 మంది మత్స్యకారులు గుజరాత్ సముద్ర తీరంలో చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.
ఇక జగన్ గుజరాత్ సీఎంతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారు ఏపీకి వచ్చేలా చేశారు. ఇందుకోసం మూడు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మొత్తం 60 బస్సుల్లో గుజరాత్ నుంచి వీరంతా ఏపీకి తరలి రానున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 13 బస్సుల్లో మత్స్యకారులు ఏపీకి చేరుకున్నారు. వీరికి మధ్యలో ఆహారం అందించడంతో పాటు సకల సౌకర్యాలు ఏపీ ప్రభుత్వం సమకూర్చనుంది. ఇక ఏపీకి చేరుకున్న వారు అందరూ ముందుగా క్వారంటైన్లో ఉండాల్సి ఉంది.
ఏపీకి చేరుకున్న మత్స్యకారులు అందరూ జగన్ చేసిన సాయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళనాడు, బెంగళూరుతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర వలస కూలీలను కూడా ఇప్పుడు ఏపీకి తరలించే ప్రయత్నాలు జగన్ సర్కార్ ప్రారంభించింది.