కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన అంసంఘటిత కార్మికులు, వలస కూలీలకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రయోజనాలు పొందేందుకు ఉన్న కనీస ఉద్యోగుల సంఖ్య, వేతనాల పరిమితిని తొలగించాలనే యోచనలో ఉంది కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్. లాక్డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులకు ఈ పథకాన్ని వర్తించేలా విస్తరించాలని ప్యానెల్ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాల విస్తరణ అంశంలో కీలక విషయాలు వెల్లడించారు.
ప్యానెల్ చీఫ్, బీజేడీ ఎంపీ భర్త్రుహరి మహ్తాబ్.
కొవిడ్-19 సంక్షోభంలో వలస కార్మికులకు సంబంధించిన సమస్యలపై వచ్చే బుధవారం (జులై 15న) ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనుంది పార్లమెంటరీ ప్యానెల్. వలస కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్యానెల్ సభ్యులు ఉన్నందున ఈ భేటీలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్).. ఉద్యోగుల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు.ఈఎస్ఐలో ఉద్యోగులు తమ జీతంలో 1.75 శాతం, యాజమాన్యాలు 4.75 శాతం చెల్లించినట్లయితే.. ఉద్యోగులు నెలకు రూ. 21,000 వరకు పొందే అవకాశం ఉంటుంది. కనీసం 10 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈఎస్ఐ వర్తింపజేస్తారు.అలాగే.. ఈపీఎఫ్ 20 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు వర్తిస్తుంది. ఇందులో ఉద్యోగులు, యాజమాన్యం సమానంగా వేతనంలో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది.