వాలంటీర్లు వేగులంటూ సెన్స్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా అంతా నాన్సెన్స్ రాతలు రాస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న ఈ వ్యవస్థపై కేవలం పిచ్చి రాతలు రాస్తూ ప్రభుత్వానికి కళంకం తీసుకువచ్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరమంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు వైయస్ జగన్ నవరత్నాలను ఇంటింటికి పారదర్శకంగా అమలు చేయాలని వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెబుతున్నారు.
ఇదే సమయంలో వారు గతంలో చంద్రబాబు హయాం నాంటి జన్మభూమి కమిటీల వ్యవస్థను గుర్తు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన అవస్థలు అనీ ఇన్నీ కావంటున్న మంత్రులు.. పింఛన్ల కోసం క్యూ లైన్లల్లో పడిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన అవ్వా తాతలు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అబద్ధాలు, అవాస్తవాలను ప్రచురించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.
కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వలంటీర్లపై దుష్ప్రచారం చేయడం హేయమని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఒక అబద్దాన్ని, అవాస్తలను రంగరించి.. ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని మంత్రి సురేష్ అన్నారు. సేవా దృక్పథంతో 2.65 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్న ఈ వ్యవస్థలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్ని అడ్డంకులు వచ్చినా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిపై ఇలాంటి దుష్ప్రచారం దురదృష్టకరమని మంత్రి సురేశ్ అన్నారు.