ప్రస్తుతం ప్రపంచదేశాలు కంటికి కనిపించని ప్రాణాంతకర కరోనా వైరస్తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ మహమ్మారి దూకుడుకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కరోనా మాత్రం ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. అయితే కరోనాను జయించాలంటే.. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) చాలా అవసరం. కరోనానే కాదు.. ప్రస్తుతం సమాజంలో రోజుకో రకం రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వాస్తవానికి ఏ రోగమైనా మొట్టమొదట వ్యాధి నిరోధక శక్తి పైనే దాడి చేసి, గెలిచి మన శరీరాన్ని ఆక్రమిస్తాయి. అందుకే ఎవరైనా సరే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని అంటుంటారు.
అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను తింటే చాలు..రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి అవేంటో అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా మీరు ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. అలాగే రోజు ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల అనేక రోగాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అదేవిధంగా, ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి తాగాలి. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేని చిట్కా అని చెప్పుకోవచ్చు. ఇక ఏ సీజన్లో అయినా ప్రతి ఇంట్లో ఉండే పండు అరటిపండు. ఇందులో ఎక్కువ మోదాతులో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ కంటికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.