నిజాయితీగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడో టాలీవుడ్ డైరెక్టర్. ఒకప్పుడు వైజాగ్ లో అరటి పండ్లు అమ్ముకునేవాడు. కానీ ఇప్పుడు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ తో సినిమా తీసేస్తాయికి ఎదిగాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా.. మారుతి. మచిలీపట్నంలో జన్మించిన మారుతి.. 2012లో `ఈ రోజుల్లో` మూవీతో దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత `బస్ స్టాప్`తో యూత్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించి త‌న మార్క్ చూపించాడు.


`కోత జంట`, `భలే భలే మగాడివోయ్`, `మహానుభావుడు` వంటి సినిమాల‌తో మినిమ‌మ్ హిట్ గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ను హీరోగా పెట్టి `ది రాజాసాబ్‌` అనే హార‌ర్ కామెడీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం 2025 డిసెంబ‌ర్ 5న విడుద‌ల కాబోతోంది. జూన్ 16న ఈ మూవీ టీజ‌ర్ బ‌య‌ట‌కు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో నిర్వహించిన `మసులా బీచ్ ఫెస్టివల్` లో మారుతి పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ ఇది.


ఈ ఫెస్టివ‌ల్ లో మారుతి త‌న పాస్ట్‌ను గుర్తు చేసుకుంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `1999లో నేను హైదరాబాద్‌కు వచ్చాను. అంత‌క‌న్నా ముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్‌ ఎదురుగా మా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. నాన్న‌తో పాటు నేనూ అర‌టి పండ్లు అమ్ముతూ సినిమాలు చూసేవాడిని. హైద‌రాబాద్ వ‌చ్చాక  స్టిక్క‌రింగ్ షాప్ పెట్టాను. కాలేజీలో చ‌దువుకుంటూ నెంబ‌ర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. క‌ష్టప‌డితే ఏదైనా సాధించొచ్చు. అందుకు నేనే ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు అర‌టి పండ్లు అమ్మే నేను ఇప్పుడు ప్ర‌భాస్ తో 400 కోట్ల సినిమా తీస్తున్నా. మీరు ఊహించిన దానికంటే రాజాసాబ్ ఒక శాతం ఎక్కువే ఉంటుంది.` అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: