టాలీవుడ్‌ సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టాడు దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి. మంగళవారం (జూన్ 10) రాత్రి ఆయన కార్డియాక్ అరెస్ట్‌ (గుండెపోటు)తో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఆయన మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇకపోతే, ఆయన గత కొన్ని నెలలుగా రవికుమార్ చౌదరి కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవనం గడుపుతున్నట్లు తెలుస్తోంది. సన్నిహితుల సమాచారం ప్రకారం.. చివరగా రాజ్ తరుణ్ తో తెరకెక్కించిన "తిరగబడరా సామి" సినిమా ఘోరంగా విఫలమైన తర్వాత ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. పైగా ఇండస్ట్రీలో సన్నిహితులు కూడా దూరం కావడంతో ఆయన మానసికంగా మరింత కుంగిపోయారని వార్తలు వస్తున్నాయి.

గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమాతో రవికుమార్ చౌదరి టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా ‘వీరభద్ర’ అనే భారీ చిత్రం తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. అనంతరం నితిన్ హీరోగా చేసిన ‘ఆటాడిస్తా’ డిజాస్టర్ అయ్యింది. కానీ, తర్వాత వచ్చిన ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో..’ చిత్రం కొంత ఊరటను ఇచ్చింది.

ఆపై మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా రవికుమార్ చౌదరి కెరీర్‌లో భారీ హిట్ గా నిలిచింది. అయితే ఆ తరువాత ఆయన మళ్లీ గోపీచంద్‌తో చేసిన ‘సౌఖ్యం’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇకపోతే ఇటీవల ‘తిరగబడరా సామి’ ప్రారంభోత్సవంలో హీరోయిన్ మన్నారా చోప్రాను రవికుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడం తీవ్ర వివాదంగా మారింది. ఈ ఘటనపై మీడియాలో పెద్ద చర్చ చెలరేగింది. అప్పటి నుంచే ఆయన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి.

సీనియర్ దర్శకుడు సాగర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన రవికుమార్ చౌదరి, అనంతరం వీవీ వినాయక్, శ్రీను వైట్ల లాంటి దర్శకులతో కలిసి పనిచేశారు. తర్వాత స్వతంత్ర దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేరుసరి నడవడిక కలిగిన రవికుమార్ చౌదరి మరణం చిత్రసీమకు తీరని లోటుగా నిలిచింది. ఆయనతో కలిసి పనిచేసిన అనేక మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఈ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: