అప్పటి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని విశాఖ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు కంభంపాటి హరిబాబు.. అయితే ఈ విజయం వెనుక టీడీపీ హస్తం ఉందని అప్పట్లో స్వయంగా ఈయనే తెలియచేసారు. ఆ ఐదేళ్లు పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. కానీ రెండోసారి బీజేపీ గెలిచాక మాత్రం కొంచెం మౌనం పాటిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో కూడా ఆయన పేరు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే . కానీ ఈ అవకాశం సోము వీర్రాజు కి దక్కింది. కంభంపాటి పార్టీ జాతీయ కమిటీ లో సభ్యునిగా తన సేవలను అందించారు. అయితే ఆంధ్రప్రదేశ్-బీజేపీ పార్టీ ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా హరిబాబు మాత్రం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం లేదన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.
అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కంభంపాటికి పార్టీలో మంచి స్థానం లభిస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే ఆయనకు తప్ప మిగతా అందరికీ పార్టీ లో మంచి పదవులే దక్కాయని తెలుస్తూ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పార్టీలో ఇది అత్యంత కీలకమైన పదవి. బిజెపి హైకమాండ్ ఏపీ నుంచి ఆమెకు అత్యున్నత పదవిని పార్టీలో కట్టబెట్టింది. ఇక బీజేపీలో ఆది నుంచి ఉన్న కంభంపాటికి పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. అంతకుముందు నుంచే ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజా నియామకాల్లోనూ కంభంపాటి పేరు లేకపోవడం గమనార్హం. ఏపీలో పురందేశ్వరికి పెద్ద పదవి దక్కడంతో కంభంపాటికి ఎలాంటి పదవి దక్కదని తేలిపోయింది. ఇప్పుడు రాజీనామా చేస్తారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. ఆంధ్ర బీజేపీ పార్టీలో కంభంపాటికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని, అందుకే ఈయన అలక వహించి పార్టీని వీడబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే స్వయంగా కంభంపాటి ప్రకటన చేసేవరకు ఆగాల్సిందే.