జగన్-దీక్షితుల సమావేశం
తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో నుండి బలవంతంగా బయటకు గెంటేసిన రమణదీక్షితుల వ్యవహారమే అందుకు నిదర్శనం. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రమణదీక్షితులు కలిసారట. దాంతో టిడిపి నేతలందరూ ఉల్లిక్కిపడుతున్నారు. జగన్-రమణదీక్షితుల భేటీ జరిగితే టిడిపి నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారో అర్ధం కావటం లేదు. తన ఇష్టం వచ్చిన వాళ్ళను కలిసే స్వేచ్చ దీక్షితులుకు ఉందన్న విషయాన్ని టిడిపి నేతలు ఒప్పుకోవటం లేదు. ప్రధానమంత్రిని మోడిని ఎందుకు కలిశారు ? అమిత్ షాను కలవటం ఏంటి ? కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ ను కలిస్తే ఏమొస్తుంది ? లాంటి వితండ వాదాన్ని వినిపిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని దీక్షితులు భావిస్తున్నారు. అందుకనే న్యాయం చేయగలరు అన్న నమ్మకం ఉన్న వారందరినీ దీక్షితులు కలుస్తున్నారు. అందులో తప్పు పట్టటానికి ఏం ఉందో అర్దం కావటం లేదు. పైగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనందసూర్య మాట్లాడుతూ, అన్యమతస్తుడైన జగన్ ను దీక్షితులు కలవటం ఏంటని మండిపడుతున్నారు. సమస్యలు చెప్పుకోవటానికి మతంతో సంబంధం ఏంటో ఆనంద సూర్యే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు కాబట్టి జగన్ ను దీక్షితులు కలిసారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును క్రిస్తియన్లు, ముస్లింలు కలవటం లేదా ? రంజాన్, క్రిస్తమస్ పండుగలపుడు చంద్రబాబు దర్గాలకు, చర్చిలకు వెళ్ళటం లేదా ? చంద్రబాబు విషయంలో అభ్యంతరం లేని మతం జగన్ విషయంలోనే ఆనందసూర్యకు కనిపిస్తోందా ?
అసలు దీక్షితుల సమస్య పరిష్కారం అవుతుందో కాదో వేరే విషయం. తనకు జరిగిన అన్యాయంపై దీక్షితులు కొన్ని ప్రశ్నలు లేవదీశారు. ఆలయం వ్యవహారాలను ఉద్దేశించి ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. చేతనైతే వాటికి సమాధానాలు చెప్పాలి. లేకపోతే నోరుమూసుకుని కూర్చోవాలి. అంతే కానీ అడ్డదిడ్డంగా మాట్లాడకూడదన్న ఇంగితం కూడా లేదు. సోమిరెడ్డి మాట్లాడుతూ, దీక్షితులును తీసుకెళ్ళి పోలీసు స్టేషన్లో పెట్టి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయని అనటం గుర్తుండే ఉంటుంది. నిజంగా దీక్షితులే తప్పు చేసుంటే విచారణ జరిపి యాక్షన్ తీసుకోవల్సిందే. అయితే, తప్పు చేసినపుడు ఏమీ మాట్లాడని ప్రభుత్వం దీక్షితులు అప్పుడెప్పుడో తప్పులు చేశాడని ఇపుడు గోల చేయటంలో అర్ధం లేదు. చూడబోతే రానున్న ఎన్నికల్లో దీక్షితుల వల్ల ఆయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కడ దూరమవుతుందో అన్న ఆందోళనే ఎక్కడ కనబడుతోంది.