ఏపీలో పడుతూలేస్తూ సాగుతున్న జగన్ పాలనపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. వంద రోజుల పాలనపై అన్ని పార్టీల నుంచి విమర్శలే ఎక్కువుగా వచ్చాయి. జగన్ పాలనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. జగన్ పాలనపై ఎక్కువుగా విమర్శలు రావడం వెనక అతడు సరైన మంత్రులను ఎంపిక చేసుకోకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జగన్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మంత్రులు ఉండి ఏం చేశారో ? అందరం చూశాం. ఇక ముగ్గురు మంత్రుల తీరుతో జగన్ పాలనపై విమర్శలు ఎక్కువుగా ఉన్నట్టు గుసగుసలు వస్తున్నాయి.
ఈ ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు సీనియర్ మంత్రులు కాగా.. మరొకరు తొలిసారి మంత్రి పదవి చేపట్టిన నేతని చెబుతున్నారు. సీనియర్ మంత్రుల్లో ఒకరు జగన్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు రాజధానిపై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల్లో లేనిపోని అయోమయం నెలకొంది. దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇద్దరికి పెద్ద డ్యామేజ్ జరిగింది. తనకు సరైన ప్రయార్టీ లేదన్న భావంతో ఆ సీనియర్ మంత్రి చాలా తెలివిగా అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
మరో సీనియర్ నేత జగన్ వద్ద తనకున్న పరపతి వాడుకుంటూ అసలు వాస్తవాలు జగన్కు తెలియకుండా వ్యవహరిస్తుండడంతో పాటు తనకంటూ ఓ కోటరీని పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్కు విశ్వాసపాత్రుడు కావడంతో మిగిలిన నేతలు కూడా ఆయన్ను ఏమీ అనలేని పరిస్థితి ఉందట. ఇక మూడో మంత్రి పాలనకు పూర్తిగా కొత్త. ఆవేశమే తప్ప ఆచరణా సామర్థ్యం లేదని ఇప్పటికే నిరూపించుకున్నారాయన.
కేవలం ప్రతిపక్షంపై గట్టిగా సౌండ్ పెంచేసి విమర్శలు చేయడం మినహా ఆ మంత్రి చేసేదేం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓకీలక శాఖకు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. ప్రతి విషయంలో లాజికల్గా మాట్లాడకుండా ఇష్టమొచ్చినట్టు ఆవేశంతో చేస్తోన్న వ్యాఖ్యలతో ఉపయోగం లేకుండా పోయింది. ఆ మంత్రి అసమర్థ కారణంగా జగన్కు పాలన సామర్థ్యం లేదన్న ముద్ర పడిపోయిందని పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. ఏదేమైనా జగన్ ఏరీకోరి మరి తీసుకున్న మంత్రుల వల్ల ఇప్పుడు ఆయనకు మైనస్ మార్కులు పడుతున్నాయి.