రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన ఆరు మాసాల్లో అనేక సార్లు కేబినెట్ మీటింగ్లు జరి గాయి. ఆ తర్వాత నెలకు రెండు సార్లు ఖచ్చితంగా మంత్రులు భేటీ అయితే, పరిస్థితులపై చర్చించి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏ కేబినెట్ మీటింగ్ కు రాని ప్రాధాన్యం తాజాగా శుక్రవారం ప్రారంభమైన మీటింగ్కు వచ్చింది.
ఈ కేబినెట్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్నయాలు తీసుకుంటారు? అనే విషయాలు కీలకంగా మారాయి. ప్రధానంగా మూడు విషయాలు చర్చించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా ఈ కేబినెట్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూస్తోంది. అమరావతి రాజధాని పై ఇప్పటికే రెండు జిల్లాల ప్రజలకు తోడు చుట్టు పక్కల జిల్లాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రాజధానిపై ఇప్పటికే వచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందని తేలడంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, కేబినెట్ అజెండా విషయాలను పరిశీలిస్తే.. జీఎన్ రావు నివేదిక అంశం కేవలం చూచాయగానే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడం, మరోపక్క, వచ్చే నెల అంటే జనవరిలో కీలకమైన సంక్షేమ కార్యక్రమం అమ్మ ఒడి సహా రైతు భరోసా రెండో విడతకు నిధులు కేటాయించడం, విశాఖలో కార్యక్రమాలకు శ్రీకారం వంటివి ఉన్నాయి.
అదే సమయంలో ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలనే అంశం కూడా ఈ కేబినెట్లో ప్రస్తావించనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేపట్టిన తాజా కేబినెట్ మీటింగ్కు ఎనలేని ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. మరి ప్రజల ఎదురు చూపులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.