దేశంలో క్రమేపి కరోనా కేసులు పెరగడంతో, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి నివారణా చర్యలను వెతకడం మొదలు పెట్టాయి. ఇటీవల ఇది హైదరాబాద్ కి కూడా పాకడంతో ఈ విషయం గురించి, సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు అన్ని విధాల తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేనప్పటికీ, తాము ఎంతో అప్రమత్తంగా ఉన్నామని అయన చెప్పారు.
ప్రజలు భయపడవద్దని, మీకు ఏమి కాదని.. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనా స్పీడుకి బ్రేకులు వేస్తామని, మీరు ఏవిధంగానూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ప్రజలకు మాటిచ్చారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిని సరిగ్గా వాడుకోవాలని సూచించారు.
ఇక వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక హైలెవల్ కమిటీ ఒకటి చర్చినట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా దీనికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బెంగళూరులో వివిధ సంస్థలను మూసేశారు. పలు రాష్ట్రాలలో థియేటర్లు, స్కూళ్లు బంద్ చేశారు. ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 200 మంది స్క్రీనింగ్ చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుంది.
శనివారం, అనగా.. ఈ సాయంత్రం 6 , 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తగు నివారణ చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తాం.. అని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా, ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని, ఈ 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని, ఈ వైరస్ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు కేసీఆర్ ధృవీకరించారు. ఇక దీనిగురించి.. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తామని, పాఠశాలల బంద్, తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి, సాయంత్రం ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.