మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి దాదాపు రెండు నెలల తరువాత ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే సమయంలో చంద్రబాబు, లోకేశ్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. పలు చోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు జన సమీకరణ చేశారు. నేతలు, కార్యకర్తలు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా హడావిడి చేశారు. 
 
పోలీసులు వారిని నియంత్రించడానికి ప్రయత్నించినా టీడీపీ కేడర్ వారిని లెక్క చేయలేదని తెలుస్తోంది. గరికపాడు చెక్ పోస్ట్, నందిగామ, కంచికచర్ల, గొల్లపూడి ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని మూకుమ్మడిగా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు కూడా కార్యకర్తలను వారించే ప్రయత్నం చేయలేదని సమాచారం అందుతోంది. 
 
చంద్రబాబు, లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించాలని... చంద్రబాబు, లోకేశ్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చంద్రబాబు తనకిచ్చిన అనుమతిని దుర్వినియోగం చేసి తన పర్యటనను రాజకీయ షోగా మార్చారని పేర్కొన్నారు. 
 
గతంలో రోజా, ఇతర ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించటాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టు టీడీపీ నేత రాసిన లేఖను సుమోటోగా రాసింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రాసిన లేఖలు హైకోర్టు పరిగణనలోకి తీసుకుని సుమోటోగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టు సుమోటోగా పరిగణిస్తే మాత్రం చంద్రబాబు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గతంలో వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు విషయంలో నిబంధనలు కూడా పాటించలేదు కాబట్టి కోర్టు ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: