ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నట్టు ఎస్ఈసీ పేర్కొంది. కాగా.. ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు.
కరోనా కారణంగానే వాయిదా వేశామని ఆ సమయంలో నిమ్మగడ్డ చెప్పారు. ఇప్పుడు కరోనా మహమ్మారి ఉందని, ఇప్పుడెందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వం నిమ్మగడ్డను ప్రశ్నించింది. అయినప్పటికి నిమ్మగడ్డ మాత్రం తన పదవీ కాలం ముగిసే లోపే ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన తరువాతే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వచ్చిన కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.