నిదానంగా విజయవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని డామినేషన్ పెరుగుతుందనే చెప్పొచ్చు...మొన్నటివరకు అంటే టీడీపీలో ఉండే అంతర్గత పోరు వల్ల కాస్త ఇబ్బందులు వచ్చాయి గాని, ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వస్తున్నట్లు కనిపిస్తోంది. బెజవాడ టీడీపీ కేశినేని చేతిలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అంతకముందు వరకు కేశినేని, బుద్దా వెంకన్న వర్గాల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే...ఈ పోరు వల్ల విజయవాడలో టీడీపీకి గట్టిగానే డ్యామేజ్ జరిగింది.

ఈ ఆధిపత్య పోరు నేపథ్యంలో కేశినేని కొన్ని రోజులు టీడీపీలో సైలెంట్ అయ్యారు..పైగా ఆయన బీజేపీలోకి వెళుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇదే క్రమంలో చంద్రబాబు సైతం...బుద్దా వెంకన్నకు వేరే పదవి అప్పగించడం...అలాగే రెండు వర్గాల మధ్య చిచ్చుకు కారణమైన విజయవాడ వెస్ట్ సీటు సమన్వయకర్తగా కేశినేనిని నియమించడంతో పరిస్తితి చక్కబడింది.

ఇక విజయవాడలో కేశినేని హవా మొదలైంది...అందుకు తగ్గట్టుగానే ఆయన దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. నగరంలోనే కాదు..విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన రెండు స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. విజయవాడ వెస్ట్, తిరువూరు స్థానాల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని చూస్తున్నారు. ఈ రెండు స్థానాలే వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో మిగిలిన సీట్లు గెలుచుకున్నా సరే, ఈ రెండు సీట్లలో టీడీపీ ఓడిపోయింది.

అందుకే ఈ సీట్లని ఎలాగైనా వైసీపీ నుంచి లాగేయడానికి కేశినేని చూస్తున్నారు. కొద్దో గొప్పో విజయవాడ వెస్ట్ మీద టీడీపీకి పట్టు పెరుగుతుంది. పైగా నెక్స్ట్ గాని జనసేనతో పొత్తు ఉంటే వైసీపీ నుంచి లాగేయొచ్చు. కానీ తిరువూరు అలా కాదు..ఇక్కడ జనసేన పొత్తు కూడా ఏం చేయలేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి స్ట్రాంగ్‌గా ఉన్నారు. అందుకే తిరువూరుపై ఎక్కువ ఫోకస్ చేసి కేశినేని పనిచేస్తున్నారు. ఎంపీ ఫండ్స్‌తో పనులు చేయడం, ఎప్పటికప్పుడు టీడీపీ శ్రేణులని కలవడం, ఇంచార్జ్‌ని సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు. మరి చూడాలి ఈ సారైనా తిరువూరు, విజయవాడ వెస్ట్‌లు టీడీపీ చేతిలోకి వస్తాయేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: