ఢిల్లీ మరియు బీహార్‌లలో అద్భుత విజయాలను నమోదు చేసుకున్న తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తదుపరి భారీ లక్ష్యం వైపు దృష్టి సారించింది: అదే పశ్చిమ బెంగాల్! వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడానికి బీజేపీ అధిష్టానం ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలనే పట్టుదలతో, ఈసారి బీజేపీ తమ గేమ్‌ ప్లాన్‌ను పూర్తిగా మార్చేసింది. దీదీ కాదు, 'అభిషేక్' టార్గెట్! .. బీజేపీ ఈసారి నేరుగా మమతా బెనర్జీని టార్గెట్ చేయకుండా, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దృష్టి సారించింది. అభిషేక్‌ను దీదీ వారసుడిగా బలవంతంగా రుద్దే ‘కుటుంబ రాజకీయాల’ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ వ్యూహ రచన చేసింది.

ఇక అంతేకాదు, అభిషేక్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలే బీజేపీకి ముఖ్య లక్ష్యం! కేవలం పెద్ద నాయకులను పార్టీలోకి లాక్కోవడం వల్ల ఒరిగేదేమీ లేదని గుర్తించిన బీజేపీ... పునాదులను కదిలించేలా తృణమూల్ కేడర్‌ను ఆకర్షించడంపై ఫోకస్ పెట్టింది. మత సమీకరణాలు, వలసదారుల అస్త్రం! .. బీహార్‌లో వర్కవుట్ అయిన కుల సమీకరణాల ఫార్ములా బెంగాల్‌లో పని చేయదని భావించిన బీజేపీ, ఇక్కడ ప్రాంతీయ మరియు మతపరమైన పోలరైజేషన్ అస్త్రాలను ఎంచుకుంది. హిందూ ఓట్లను ఏకం చేయగలిగితే విజయం సాధ్యమేనని బీజేపీ లెక్కలు కడుతోంది. అలాగే, అక్రమ వలసదారుల సమస్యను హైలైట్ చేస్తూ, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసింది.

గత ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో గట్టి పట్టు సాధించిన బీజేపీ... ఈసారి ఏకంగా 160 నుంచి 170 సీట్లు గెలవాలని అతి భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది! సవాలు: 6% ఓట్ల గ్యాప్!.. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 40% ఓటింగ్ షేర్ లభించినప్పటికీ... టీఎంసీ ఇప్పటికీ 48% ఓటు షేర్‌తో బలంగా ఉంది. అంటే, ఈ అంతరాన్ని దాటడానికి బీజేపీకి అదనంగా మరో 6% ఓట్లు అవసరం. బీహార్ విజయంతో వచ్చిన ఫుల్ జోష్‌లో ఉన్న అమిత్ షా టీమ్... ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించేందుకు గట్టి యుద్ధానికే సిద్ధమైంది! మరి వారి వ్యూహాలు దీదీ కోటను కూల్చగలుగుతాయో లేదో రానున్న ఎన్నికల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: