భారత జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో తొమ్మిది పరుగులు సాధిస్తే ఓ అరుదైన రికార్డును తిరగరాసే అవకాశముంది. సూపర్ ఫామ్లో ఉన్న రోహిత్ ఇప్పటి వరకు 2, 379 పరుగులు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య పేరిట రికార్డు ఉంది. సనత్ జయసూర్య 22 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఈ రికార్డును, రోహిత్ బద్దలు కొట్టే ఛాన్సుంది. 1997లో సనత్ జయసూర్య 2, 387 పరుగులు నమోదు చేసి, ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు.
జయసూర్య రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్ చక్కటి అవకాశముంది. ఆదివారం కటక్లో భారత, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించాలంటే ఓపెనర్లు మళ్లీ చెలరేగి ఆడాల్సిందే. విశాఖ వన్డేలో పరుగుల వరద పారించి, జట్టుకు పటిష్ట పునాది వేసిన రోహిత్, రాహుల్ లు , కటక్ వన్డేలోను తమ బ్యాట్కు పని చెప్పాల్సిందే. ఈ క్రమంలో రోహిత్ మరొక తొమ్మిది పరుగులు సాధిస్తే జయసూర్య పేరిట ఉన్న రికార్డును తిరగరాసినట్లవుతుంది. రోహిత్ ప్రస్తుతమున్న ఫామ్ను పరిశీలిస్తే తొమ్మిది పరుగులు అవలీలగా సాధించడం ఖాయం. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. ప్రపంచ మేటీ బ్యాట్స్ మెన్ కూడా ఒకొక్కసారి డకౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. జయసూర్య రికార్డును అధిగమించేందుకు రోహిత్ తనకు కావాల్సిన తొమ్మిది పరుగులు సాధించేందుకు క్రీజ్ వద్ద కొద్దిసేపు నిలబడితే చాలు, పరుగులు వాటంతట అవే వచ్చి , ఖాతాలో చేరుతాయి.
విశాఖ వన్డేలో భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి వెస్టిండీస్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలి వన్డేలోని పొరపాట్లను పునరావృత్తం చేయకుండా, తొలుత బ్యాట్స్మెన్లు రాణించి ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ నిర్దేశించగా, ఆ తరువాత బౌలర్లు ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్లను తక్కువ స్కోర్కే కట్టడి చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. వెస్టిండీస్తో జరిగిన టీ-ట్వంటీ సిరీస్ గెల్చుకున్న భారత్ జట్టు , వన్డే సిరీస్ కూడా గెల్చుకోవాలంటే కటక్ వన్డేలో జయకేతనం ఎగురవేయాల్సిందే.