పులిహోరను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు పులిహోరను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పులిహోరలు అనేక రకాలుగా చేసుకుంటారు. మనకు తెలిసినంత వరకు చింతపండు, నిమ్మకాయ, మామిడి కాయలతో ఎక్కువగా పులిహోర చేసుకొని తింటుంటాము. కానీ ఈ సారి రుచికరమైన గోంగూరతో పులిహోరను ట్రై చేయండి. దీనిని మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

గోంగూర పులిహోరకు కావాల్సిన పదార్దాలు:

బియ్యం - రెండు కప్పులు, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, ఉప్పు - తగినంత, గోంగూర - రెండు కట్టలు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మెంతులు - అర టీస్పూన్‌, ఎండు మిర్చి - రెండు, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, ఎండు మిర్చి - రెండు, పచ్చిమిర్చి - మూడు, ఇంగువ - చిటికెడు, నూనె - తగినంత.

గోంగూర పులిహోర తాయారు చేసే విధానం:

అయితే ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక గోంగూర వేగించాలి. పది నిమిషాలు వేగిస్తే గోంగూర పచ్చిదనం పోతుంది. తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేయాలి.

తరువాత గోంగూర వేసి పేస్టు మాదిరిగా పట్టుకోవాలి. మళ్లీ పాన్‌లో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేగించాలి. పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత గోంగూర పేస్టులో వేసి కలపాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంలో గోంగూర పేస్టు, తగినంత ఉప్పు వేసి కలుపుకుని సర్వ్‌ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: