రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అప్పటి పరిస్థితిని బట్టి.. కారణాలను బట్టి రాజకీయ నేతలకు అనేక పరిస్థితులు ఎదురవుతాయి. ఆయా పరిస్థితులకు అనేక కారణాలు ఉంటాయి. వాటిపై పోరాటం చేయడం సహజంగానే రాజకీయ నేతలకు అలవాటు! అయితే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి భి న్నంగా.. రాష్ట్రంలో ఏది జరిగినా.. ఒక్కటే మంత్రం అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. సాధారణంగా.. ప్రతిపక్షం అంటేనే అధికార పక్షంపై విమర్శలు చేస్తుంది. అయితే, దీనికి కూడా ఓ సమయం, సందర్భం అంటూ ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏపీలో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది.
ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లలో కుక్క మొరగకపోయినా.. అధికార పార్టీ కుట్రపన్నిందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ వైసీపీ అధినేత, సీఎం జగన్కు ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. సో షల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై సుప్రీం కోర్టు నుంచి జిల్లా కోర్టు వరకు కూడా దేశవ్యాప్తంగా తప్పు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే కదా.. ప్రజా ఉద్యమకారులను కూడా కేసులు పెట్టి జైళ్లకు పంపించారు! నిజానికి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19ను ఎవరూ కాదనరు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అయితే, దీనికి కూడా అదే రాజ్యాంగం కొన్ని పరిమితులు విధించిందనే విషయాన్ని విస్మరిస్తుండడం ఇప్పుడు వివాదంగా మారింది.
వ్యక్తిగత దూషణలు, కులాలపై దాడులు.. అధినేతల వ్యక్తిగత అంశాలపై విమర్శలు చేయడం.. వంటివి ఏమేరకు ఆర్టికల్ 19 కిందకి వస్తాయో.. నాయకులు ఆలోచించాలి. `రాష్ట్ర అసెంబ్లీలో 151 మేకలు.. 23 పులులు`-అని చేసిన కామెంట్ స్వేచ్ఛ కిందకే వస్తుందా? రెచ్చగొట్టడం కిందకి వస్తుందా? ఇలాంటివి అనేకం. ఈ క్రమంలోనే పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం దీనికి కూడా మసి పూసి మారేడు కాయ చేసినట్టు .. జగన్ తమను, తమ నేతలను లొంగ దీసుకునేందుకే ఇలా కేసుల కొరడా ఝళిపిస్తున్నాడంటూ.. వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
అదేవిధంగా టీడీపీ నేతలు.. పార్టీకి దూరంగా ఉన్నా.. తమపై విమర్శలు చేస్తున్నా కూడా.. వైసీపీ నేతలు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారని కత్తులు నూరుతున్నారు. అప్పుడు ఈ టీడీపీ నేతలకు ఆర్టికల్ 19 వర్తించదన్నమాట! తమ నేతలు తమపై విమర్శలు చేస్తే.. వైసీపీ ప్రోత్సహించినట్టు.. తమ నేతలు వైసీపీని తిట్టిపోస్తే.. ఆర్టికల్ 19 వాడుకుంటున్నట్టు..? ఇదీ .. ఇప్పుడు టీడీపీ అనుసరిస్తున్న వ్యూహం. అయితే, ఇది ప్రజాక్షేత్రంలో ఎంతోకాలం నిలిచే పరిస్థితి ఉండదని అంటున్నారు పరిశీలకులు. అన్నింటికి ఒకటే మంత్రమా? అంటూ.. ప్రశ్నిస్తున్నారు కూడా!!