
కేవలం స్కూల్ అసిస్టెంట్ ఉపాద్యాయ దంపతులకు మాత్రమే బదిలీలు చేపట్టారని.. ఎస్జీటీ, లాగ్వేజ్ పండితులు, పీఈటీ ఉపాద్యాయుల దంపతులకు చేయడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని మంత్రులు, లకిడికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ.. పది రోజులుగా తిరుగుతున్న సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక దగ్గర పని చేస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు పేర్కొనడం జరిగిందని ఉపాధ్యాయ దంపతులు వారు గుర్తు చేశారు.
స్పౌజ్ ఫోరం సభ్యులు చేస్తున్న ఆవేదన కార్యక్రమాలు, మౌన దీక్షలు, వినతి పత్రాల వలన సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ముందుకు రావడం జరిగిందని ఉపాధ్యాయ దంపతులు తెలిపారు. దానిలో భాగంగానే ఇటీవల 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను చేపట్టడం జరిగిందని...కానీ 2100 అప్లికేషన్లలో కేవలం 30% మాత్రమే బదిలీలు చేపట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే సాకు చూపించి ఎస్జీటీ ,పియిటి, భాషా పండితుల బదిలీలను నిలుపుదల చేశారని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన వ్యక్తంచేశారు.
వాస్తవంగా SGT విభాగంలో ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండి, ప్రస్తుత ప్రమోషన్ల తర్వాత ఇంకా ఎక్కువ ఖాళీలు ఏర్పాడనున్నాయని ఉపాధ్యాయ దంపతులు పేర్కొన్నారు. ఇందులో 80 నుంచి 90% వరకు ఇబ్బంది పడుతున్నది మహిళా ఉపాధ్యాయినీలేనని.. ప్రతిరోజు 150 నుంచి 200 కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఇటు కుటుంబానికి అటు వారి వృత్తికి దూరమై తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారని ఉపాధ్యాయ దంపతులు వాపోయారు.