ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ విద్యార్థులకు వచ్చే ఐదేళ్లలో పోస్ట్ - మెట్రిక్ ష్కాలర్షిప్లను అందజేయాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి పైగా ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. మొత్తం 59 వేల కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం కోసం కేంద్రం ఖర్చు చేయనుంది. అయితే ఈ మొత్తంలో 60 శాతం నిధులు కేంద్రం, మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తంగా రూ.35,534 కోట్లను వచ్చే ఐదేళ్లలో అందజేయనుంది.
అర్హులైన
ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ నగదును డీబీటీ విధానంలో బదిలీచేయనున్నారు. ఈ పథకం కింద 2017-18 నుంచి 2019-20 వరకు ఏడాదికి రూ.1100 కోట్ల అందజేయగా.. ప్రస్తుతం ఇది ఐదు రెట్లు పెరిగింది. 2020-21నుంచి 2025-26 వరకు ఏడాదికి దాదాపు రూ.6,000 కోట్ల అందజేయనుంది. దీని వల్ల పదో తరగతిలోపు చదువు మానేసిన 1.36 కోట్ల మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఉపకార వేతనంతో వచ్చే ఐదేళ్లు ఉన్నత విద్యను అభ్యసించే వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. మరోవైపు, 20 ఏళ్ల కాల పరిమితితో డీటీహెచ్ లైసెన్స్ను మంజూరు చేయాలని
క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే,
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్
నిధి యోజన’ పథకం కింద దేశంలోని 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేల కోట్లను జమ చేయనున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సొమ్మును జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి
ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇలా వరుసగా కేంద్రం ప్రకటిస్తున్న వరాల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.