సంక్రాంతి.. ఈ పండుగ తెలుగు లోగిళ్లకు కొత్త కళ తీసుకొస్తుంది. ఇది నిజమే కానీ.. పండుగ ఖర్చు కూడా మామూలుగా ఉండదు. కాస్త సౌండ్ పార్టీలైతే పర్వాలేదు. కానీ పేద, కింది తరగతి వారికి సంక్రాంతి భారమే. అలాగని చూస్తూ ఊరుకోలేరు కదా. అంతా పండుగ చేసుకుంటుంటే.. పిల్లల ముఖం మాడ్చలేరు కదా.
అందుకే అప్పో సొప్పో చేసి పండుగ చేసుకుంటారు. అయితే ఏపీలో ఇలా సంక్రాంతి కోసం అప్పుచేసే బాధ సీఎం జగన్ పుణ్యమా అని తప్పిపోయింది. ఎందుకంటే.. ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలకు రూ. 15 వేల రూపాయలు ఎకౌంట్లో పడిపోయాయి.
నిన్న మొన్నటి వరకు డబ్బులు లేక ఇబ్బంది పడిన పేదలకు ఇప్పుడు ఇంటి నిండా పండగ పంచారు సీఎం జగన్. ఆయన ఇచ్చి న అమ్మ ఒడి డబ్బులతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. 15 వేలు పండగకు రావడం అంటే మామూలు విషయం కాదు. కొత్త బట్టలు, పిండివంటలు, పండుగ సంబరాలకు ఈ మొత్తం బాగానే సరిపోతుంది.
అందుకే చాలా చోట్ల తమ ఖాతాల్లో పడిన అమ్మ ఒడి సొమ్ము తీసుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వంటి చోట్ల ఈ అమ్మఒడి డబ్బులు కోసం జనం బ్యాంకుల ముందు బారులు తీరారు. మొత్తానికి పిల్లల చదువు కోసం ఉద్దేశించిన అమ్మ ఒడి సొమ్ములు సంక్రాంతి వెలుగులు నింపుతున్నాయన్నమాట.