ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైనప్పటి నుంచే అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాన్ని చిత్రంలో ఇష్టానుసారం మార్చేసారని, ముఖ్యంగా గ్రాఫిక్స్, పాత్రల లుక్, డైలాగులు అన్నీ ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసాయని చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రావణాసురుడి గెటప్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా తీవ్రమైన ట్రోలింగ్ చోటుచేసుకుంది. టీజర్ విడుదలైన క్షణం నుంచి ఈ చిత్రంపై విమర్శలు, మీమ్స్ వరుసగా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు సుమన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఆదిపురుష్’ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాణాలను, చారిత్రక కథలను మలచి చిత్రీకరించే ప్రస్తుత ట్రెండ్‌పై స్పందించిన ఆయన, భారతీయ సంస్కృతిని, పురాణాలను ఇలా తారుమారు చేసి చూపించడం ఏ విధంగానూ సమంజసం కాదని స్పష్టం చేశారు.


సుమన్ మాట్లాడుతూ— “ఇప్పుడు చరిత్రను, పురాణాలను ఇష్టమొచ్చినట్టు మార్చేస్తున్నారు. అడిగేవాళ్లు లేరు కాబట్టే ఇలా చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎవరో ఒకరు దీనిపై కోర్టు దాకా వెళ్లాలి. ఇటీవల ‘ఆదిపురుష్’ అనే సినిమాను తీశారు. అది పూర్తిగా తప్పుగా తీసిన చిత్రం. రావణాసురుడి వేషధారణ అసలు పురాణాల్లో చెప్పినట్టే కాదు. పౌరాణికమైన రాక్షస రాజును లెదర్ జాకెట్ వేసుకొని, స్టైలిష్ విలన్‌లా చూపించడం అర్థం కాని పని. రాముడికి కూడా మీసాలు పెట్టేశారు. అసలు వాళ్లు ఎలా నటించారో నాకు తెలియదు కానీ, ప్రేక్షకులంతా ఆ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ సినిమాను ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు” అని అన్నారు.



అంతేకాకుండా, హిందూ సంస్కృతిని కాపాడాలనుకునే వారు ఇలాంటి మార్పులపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “హిందూఇజం డెవలప్ అవ్వాలి, అందరికీ చేరాలి అనుకునేవాళ్లు నిజంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఎవరి చేతిలో వారికి నచ్చినట్టు పురాణాలను మార్చేస్తారు. ఇదే వేరే మతం మీద సినిమా తీశారని అనుకోండి… థియేటర్లు తగలబెట్టే స్థాయి రియాక్షన్ వచ్చేది. కానీ హిందువులు కాబట్టి సైలెంట్‌గా ఉంటారు” అని సుమన్ వ్యాఖ్యానించారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. వివాదాస్పద చిత్రాల సందర్భంలో కళాత్మక స్వేచ్ఛ, పౌరాణిక కథాంశాల పవిత్రత వంటి అంశాలపై మళ్లీ చర్చ తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: