అనంతపురంలో విద్యార్ధులపై జరిగిన లాఠీ చార్జ్ కు సంబంధించి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తుంది. టీడీపీ నాయకులు కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. ఇక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా మారుస్తారా? అని ప్రశ్నించారు.

ఎస్.ఎస్.బి.ఎన్.కాలేజీ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ గర్హనీయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వమే సమస్యకు బీజం వేసి... దాన్ని శాంతిభద్రతల సమస్యగా మారుస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అని నాదెండ్ల కోరారు.  సజావుగా సాగుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని విమర్శలు చేసారు. విద్యార్థులు, తల్లితండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసివేయవద్దని డిమాండ్ చేస్తూనే ఉన్నారు అని అన్నారు.

అనంతపురంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఎస్.ఎస్.బి.ఎన్. కాలేజీను ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం అని నాదెండ్ల పేర్కొన్నారు. ఒక విద్యార్థిని తలకు బలమైన గాయమైంది అంటే ఆ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్థం అవుతోంది అన్నారు.

విద్యార్థులు, వారి తల్లితండ్రులు పడుతున్న ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని ఒక శాంతిభద్రతల సమస్యగా మార్చాలనుకోవద్దు అని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎందరో దాతలు విద్యాభివృద్ధి కోసం ఆస్తులు దానం చేసి పేదలకు విద్యను చేరువ చేశారు అని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల ఎంతో చరిత్ర ఉన్న పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి అని నాదెండ్ల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap