గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల దెబ్బకు నగర ప్రజలు చిగుటకులా వణికిపోతున్నారు. బయటకు అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు ప్రజలు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి పూణే నగరం విలవిలలాడిపోయింది.
ఐటి రంగానికి ప్రసిద్ధి గాంచిన పూణేలో ఇప్పుడు ఎక్కడ చూసిన వరద నీరు, బురద, కొట్టుకొచ్చిన వాహనాలు కనిపిస్తున్నాయి. ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఈ వరదల తాకిడికి దాదాపు 12 మంది మరణించారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో.. ఎన్నికల వేడి
రాజుకుంది. ఒకవైపు ఎన్నికల వేడి.. మరోవైపు భారీ వర్షాలతో మహారాష్ట్ర ఇబ్బందుల్లో పడిపోయింది.
ఇదిలా ఉంటె, ఇటు ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు కుదిపేస్తున్నాయి. వర్షాల కారణంగా చెరువులు, వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో మరోసారి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వస్తున్నది. ఈ వరద నీటితో జలాశయం నిండుకుండలా మారింది. కిందికి నీటిని వదులుతున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం హుదూద్ తుఫాన్ విశాఖను కుదిపేసింది. హుదూద్ నుంచి విశాఖ త్వరగానే కోలుకుంది.
కాగా, ఇప్పుడు మరలా విశాఖను తుఫాను భయం భయపెడుతున్నది. ఏపీకి హికా తుఫాను భయం పట్టుకుంది. ఈ తుఫాను ఎంత భయానకంగా ఉండబోతుందో అని అధికారులు అంచనాలు వేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి విశాఖలో రోడ్లు జలమయం అవుతున్నాయి. ఇల్లు కూలిపోతున్నాయి. కేవలం ఇల్లు మాత్రమే కాదు.. గుళ్ళు సైతం వర్షానికి కూలిపోతున్నాయి. విశాఖలో కట్టపై నిర్మించిన గంగమ్మ దేవాలయం వరదనీటిలో కొట్టుకుపోయింది. ఇలానే కొన్ని రోజులు వర్షాలు కురిస్తే విశాఖ వాసులు ఇబ్బందులు పడాల్సిందే.