కరోనా కల్లోలానికి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే 60 దేశాలకు పైగా విస్తరించిన ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలా? అని బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. చైనా సహా కరోనా బాధిత దేశాల్లో ఇప్పటికే సుమారు 3 వేల మంది ప్రాణాలు కోల్పోగా... వైరస్ సోకిన వారి సంఖ్య కూడా లక్షకు చేరువవుతోంది. దాంతో... కొవిడ్-19తో అల్లాడిపోతున్న దేశాలన్నీ... ఆంక్షలు విధించుకుంటూ పోతున్నాయి.
కోవిడ్ .. ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్... ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. చాపకింద నీరులా వ్యాపించిన కరోనా... ఇప్పుడు శర వేగంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించి... వేల మందిని బలి తీసుకుంది. సౌత్ కోరియాలో కొత్తగా 376 కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 3 వేల 526కు చేరింది. ఇటలీని కోవిడ్ వైరస్ భయపెడుతోంది. ఇప్పటివరకు ఇటలీలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. అటు మిలాన్కు విమాన సర్వీసులు నిలిపివేసింది అమెరికా.
ఇరాన్లోనూ రోజు రోజుకు కోవిడ్ కేసుస సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరాన్లో ఇప్పటికే 43 మంది చనిపోగా..600 మందికి కేసు నిర్ధారణ అయింది. దీంతో ఇరాన్పై ఇతర దేశాలు ఆంక్షలు విధించాయ్. ఇరాన్ వాసులు ఇండియాకు రాకుండా వీసాలు నిలిపివేశారు మన అధికారులు. ఇరాక్ లో ఇప్పటివరకు 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. కొత్తగా ఐర్లాండ్, ఈక్వెడార్, లక్సెంబర్గ్లోనూ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ భయంతో పారిస్ లో జరగాల్సిన హాఫ్ మారథాన్ను వాయిదా వేశారు. దక్షిణ కొరియాలోనిర్ధారణ కేసులు 3 వేల 150 దాటాయి. మృతుల సంఖ్య 17కు చేరింది.
చైనాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హుబె ప్రావిన్స్ లో మరో 34 మంది చనిపోయారు. 570 మంది కొత్తగా కోవిడ్ భారీన పడ్డారు. హుబె ప్రావిన్స్ లో కోవిడ్ తో ఇప్పటి వరకు 2 వేల 692 మంది చనిపోయారు. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న సౌత్ చైనాకు చెందిన 32 ఏళ్ల డాక్టర్ కూడా చనిపోయాడు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి ముప్పు, ప్రభావం తీవ్రతను మరింత స్థాయికి పెంచింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
కరోనా భారత్లో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తైవాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు అనుమానం రావడంతో రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓ పరిశ్రమలో యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు తైవాన్కు చెందిన చెన్ షి హసన్.. ఫిబ్రవరి 17న తిరుపతికి వచ్చాడు. అతనికి జలుబు, దగ్గు రావడంతో కంపెనీ యాజమాన్యం, జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి అతని రక్త నమూనాలు సేకరించారు. వాటికి పుణెెలోని ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఇప్పటికైతే భారత్లో డేంజర్ బెల్స్ లేకపోయినా.. దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.