దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలుసిందే. ముఖ్యంగా ఒక్కరి కారణంగా చాలా మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరో చేసిన తప్పుకు ఇంకొకరు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి వస్తుంది. ఇక కొంతమంది వ్యక్తుల కారణంగా ఎంతో మంది ప్రముఖులు సైతం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోవాల్సిన దుస్థితి వస్తుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి అద్ధం పట్టేలా ఉంది. ఒక దొంగ వల్ల ఏకంగా ఇరవై రెండు మంది క్వారంటైన్ లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దొంగకు కరోనా వైరస్ పాజిటివ్ ఉందని నిర్ధారణ కావడంతో ఈ దుస్థితి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... ఒక దొంగ కారణంగా 22 మంది క్వారంటైన్ లో గడపాల్సిన పరిస్థితి వచ్చిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని గోరేగావ్ కు చెందిన ఓ యువకుడు సిగరెట్ షాప్ లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో సదరు దొంగని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే సదరు దొంగ పై పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత అతన్ని విచారణ నిమిత్తం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక కొన్ని రోజులు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పోలీసు విచారణ ముగిసిన అనంతరం తొలుత అతన్ని తానే లోని సెంట్రల్ జైలుకు తరలించారు.
కానీ ఆ సెంట్రల్ జైలు ఖైదీలు సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా... ఆ దొంగను రాయగడ్ లోని సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. అయితే సదరు నిందితుడికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తే తప్ప జైల్లోకి అనుమతించము అంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అతడికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అటు పోలీసులు ఇటు అధికారులు షాక్ కి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతని కేసును విచారించిన జడ్జి కోర్టు సిబ్బంది విచారణలో భాగంగా అతనితో గడిపిన పోలీసులు అందరూ మొత్తం 22 మంది వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది.