రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. అయితే.. ఒక్కొక్క‌సారి.. ఇది అధిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఇలాంటిదే.. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు ఏపీ పుర‌పోరులోనే హైలెట్ కావ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అద్దంకిలోని 8వ వార్డును ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని అధికార‌ వైసీపీ నేత‌లు వేసిన ఎత్తు గ‌డ‌ల‌ను టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కుమార్ భ‌గ్నం చేసి.. అధికార పార్టీ నేత‌ల‌కు గూబ అద‌ర‌గొట్టార‌నే కామెంట్లు వినిపిస్తు న్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వైసీపీ షాకిస్తుంటే.. ఇక్క‌డ మాత్రం దీనికి భిన్నంగా టీడీపీనే వైసీపీకి భారీ ఎత్తున షాకివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. అద్దంకి న‌గ‌ర పంచాయ‌తీలోని 8వ వార్డును ఎస్టీ సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. ఈ క్ర‌మంలో టీడీపీ త‌ర ‌ఫున ఇద్ద‌రు స‌భ్యులు క‌త్తి కామ‌య్య‌, ఇండ్ల కోటేశ్వ‌ర‌రావులు గ‌త ఏడాదే నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే.. ఆ త‌ర్వాత కాలంలో వీరిని అధికార పార్టీ నేత‌లు ఆక‌ర్షించి.. త‌మ పార్టీలో చేర్చుకున్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున అప్ప‌ట్లోనే ఇద్ద‌రు నామినేష ‌న్ వేశారు. బొజ్జ ప‌రశురాం, బొజ్జ వెంక‌టేశ్వ‌ర్లు.. వైసీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు వేశారు. అయితే.. టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్లు వేసిన వారిని ఎలాగూ త‌మ‌వైపు తిప్పుకొన్నాం.. క‌నుక‌.. వీరితో నామినేష‌న్లు ఉప‌సంహ‌రిస్తే.. త‌మ వారు ఏక‌గ్రీవం అయిన‌ట్టేన‌ని వైసీపీ నేత‌లు భావించారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్ లు వేసిన క‌త్తి కామ‌య్య‌, ఇండ్ల వెంక‌టేశ్వ‌ర్లు.. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి రోజైన బుధ‌వారం నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఇక‌,వైసీపీ త‌ర‌ఫున వేసిన ఇద్ద‌రు మిగిలారు. అయితే.. వీరిలో బొజ్జ ప‌ర‌శురాంను గొట్టిపాటి ర‌వి తెలివిగా.. త‌న‌వైపు తిప్పుకొన్నారు. అంటే.. వైసీపీకి రెబ‌ల్‌గా మారారు. ఎలాగూ తాము ఏక‌గ్రీవం చేయాల‌నుకుంటున్నాం.. క‌నుక అదేదో.. ప‌ర‌శురాంకు ఇస్తే.. రెబ‌ల్‌గా వెన‌క్కిత‌గ్గి.. త‌మ‌గూటికి చేర‌తార‌ని వైసీపీ నేత‌లు భావించారు.

ఈ క్ర‌మంలో వైసీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేసిన‌.. బొజ్జ వెంక‌టేశ్వ‌ర్లుతో వైసీపీ నాయ‌కులు ద‌గ్గ‌రుండి నామినేష‌న్ ఉప‌సంహ‌రిం చి.. ప‌ర‌శురాంకు బీఫారం ప్ర‌క‌టించారు. అయితే.. నామినేష‌న్‌కు కేవ‌లం రెండు నిమిషాల ముందు.. ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి .. స్వ‌యంగా ప‌ర‌శురాంను తీసుకుని వ‌చ్చి.. నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రించారు. అంతే!! ఇంకేముంది.. ఏక‌గ్రీవం చేసుకుందామ‌ని అనుకున్న వైసీపీకి భారీ షాక్ త‌గిలిన‌ట్టు అయింది. టీడీపీని చెర‌పాల‌ని అనుకుని.. వైసీపీ నేత‌లే చెడ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యే గొట్టిపాటి ఎత్తుకు పైఎత్తు వేయ‌డంపైనా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: