ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అంతా వారసుల రాజ్యం నడుస్తుంది. అధికార వైసీపీకి చెందిన మంత్రులు , పలువురు సీనియర్ నేతలు , ఎమ్మెల్యేలు వార‌సులే త‌మ తమ నియోజకవర్గాల్లో ప‌నులు చ‌క్క‌ పెడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలకు రాజకీయ సన్యాసం తప్పదని అంటున్నారు. ఈ లిస్టులో వైసీపీ నుంచి మాజీ మంత్రులు గా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయ‌ర‌ని... శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఆయన తనయుడు పోటీ చేస్తారని అంటున్నారు.

ఇక ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ధ‌ర్మాన‌ పూర్తిగా సైలెంట్ అయిపోగా... ఆయన వారసుడు పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ చక్కబెట్టే స్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ‌ర‌ని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఆయన.. ఈ రాజకీయాలు తనకు న‌ప్ప‌వు అని... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని... రాజకీయాల నుంచి తప్పుకుంటానని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఈసారి మార్పులు చేర్పులలో ఏదైనా మంత్రి పదవి వస్తే తప్ప లేకపోతే మహీధ‌ర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని అంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ది కూడా అదే పరిస్థితి. గత ఎన్నికలకు ముందే వైసీపీ లోకి వచ్చిన ఆనం ఎమ్మెల్యే గా గెలిచిన ఆరు నెలల నుంచే జగన్ తో విబేధించడం ప్రారంభించారు. ఎవరైనా గీత దాటితే వారిని వదులుకునేందుకు కూడా సిద్ధం అని పార్టీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేయడంతో ఆనం కొద్ది రోజులుగా రగిలిపోతున్నారు.

ఒకవేళ వైసీపీలోనే ఉండాల్సి వస్తే వచ్చే ఎన్నికల్లో ఆనం పోటీ చేయరని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ ని వీడితే ఆయన మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని వారి వారసులకు సీట్లు ఇప్పించు కుంటారు అని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: