జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండుతున్న ఆజ్యంలో మరింత పెట్రోలు పోశారు. అయితే పోయటం కూడా సరిగా పోయలేదు. ఎందుకంటే అందుకు ధైర్యం సరిపోయినట్లు లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే అమలాపురంలో మాట్లాడుతు జనసేన అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులతో చర్చలు జరుపుతానని ప్రకటించారు. జనసేన అధికారంలోకి వచ్చేదెప్పుడు, పవన్ ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు అన్నది వేరే విషయం. కానీ ప్రకటన చేసేముందే పర్టిక్యులర్ అంశంపై కసరత్తు చేయాలి కదా.
సీపీఎస్ రద్దుకు ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతానని చెప్పటమే విచిత్రమైన ప్రకటన. ఉద్యోగులు కోరుతున్నది సీపీఎస్ రద్దు+ఓపీఎస్ పునరుద్ధరణ. సీపీఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. 2004లో యూపీఏ ప్రభుత్వం ఓపీఎస్ రద్దుచేసి దాని స్ధానంలో సీపీఎస్ ను తీసుకొచ్చింది. రెండు విధాల్లోను రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఓపీఎస్ విధానంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి.
అందుకనే 2004 తర్వాత ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులంతా పెన్షన్ విషయంలో ఓపీఎస్ విధానమే కావాలని గోలచేస్తున్నది. 2019 ఎన్నికల్లో ముందు వెనకా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చేశారు. అప్పట్లో ఇచ్చిన హామీయే జగన్ను ఇపుడు కూడా వెంటాడుతోంది. తన హామీ వల్ల ఖజానాకు పడే భారంపై లెక్కలు వేసుకున్న జగన్ తర్వాత చెంపలేసుకున్నారు. అందుకనే మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) ప్రతిపాదించారు. దీన్ని ఉద్యోగులు అంగీకరించటంలేదు.
ఓపీస్ పునరుద్ధరణ జరిగే పనికాదని తెలిసే చంద్రబాబునాయుడు ఏమీ మాట్లాడటంలేదు. జగన్ తొందరపడి ఇబ్బందుల్లో పడ్డారు. అలాంటిది ఇపుడు పవన్ సీపీఎస్ రద్దుకు చర్చలు జరుపుతానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సీపీఎస్ విధానాన్ని జగన్ క్యాబినెట్ రద్దుచేసేసింది. ఆల్రెడీ రద్దయిన విధానం గురించి మళ్ళీ పవన్ చర్చించేదేముంది ? ధైర్యముంటే ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని ప్రకటించాలి. లేకపోతే అసలా అంశాన్ని వదిలేయాలి. అంతే కానీ సగం సగం ప్రకటించటమేంటో అర్ధంకావటంలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి