ఈసారి బీహార్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, దాదాపు 69 శాతం మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటువంటి భారీ పోలింగ్ నమోదవడం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను, ఉత్కంఠను మరింత పెంచింది. అధిక శాతం ఓటర్లు బయటకు రావడం వల్ల ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న అంచనాలు పండాయి.
కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న ప్రారంభ రౌండ్ల ట్రెండ్ల ప్రకారం, ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ల నుంచే నమోదు అవుతున్న ఈ ఆధిక్యం క్రమంగా పెరుగుతూ ఉండటంతో ఎన్డీయే శ్రేణుల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహాగట్ బంధన్ వర్గాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన జన్ సురాజ్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆశాజనక ప్రదర్శన చేస్తోంది. పివాల్యూ అనలిటిక్స్ అందించిన తాజా గణాంకాల ప్రకారం, ఆ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు కీలక స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు.
జన్ సురాజ్ పార్టీలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే:
చన్పటియా: త్రిపురారి కుమార్ తివారీ అలియాస్ మనీష్ కశ్యప్
చైన్పూర్: హేమంత్ కుమార్ చౌబే
కర్గాహర్: రితేష్ రంజన్
ఈ ముగ్గురు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో స్థిరమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు వేల ఓట్ల తోనే వీళ్లు ఆధిక్యంలో ఉన్నారు. కొత్త పార్టీగా తక్కువ కాలంలోనే ప్రజల్లో పాతుకుపోయిన జన్ సురాజ్ పార్టీ ప్రదర్శన విశేషంగా ఉంది. ఈ ట్రెండ్లు కొనసాగితే ఆ పార్టీ బీహార్ రాజకీయ పటంలో శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలవబోయే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద, బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికీ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రౌండ్ తరువాత రౌండ్ లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ, రాష్ట్ర రాజకీయ భవిష్యత్ రూపురేఖలు స్పష్టత సాధించనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి