మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా అలాంటి ఘటన తాజాగా ఏపీలోనూ చోటుచేసుకుంది. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి మోజులో పడి కడతేర్చిందో భార్య. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన భర్తకు మృత్యువును కానుకగా ఇచ్చింది. గ‌ద్వాల తేజేశ్వ‌ర్ హ‌త్య కేసులో కళ్లు బైర్లు క‌మ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..


జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల రాజావీధి నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గంటా జయరాం, శకుంతల దంపతుల చిన్న కుమారుడు గంటా తేజేశ్వర్‌(33) ప్రైవేటు సర్వేయర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. కొద్దిరోజులు క్రితం కర్నూలు జిల్లా కొల్లూరు లో బ్యూటిషన్ గా పనిచేసే ఐశ్వర్య అలియాస్ సహస్రతో తేజేశ్వర్ కు ఫిబ్ర‌వ‌రి 13న‌ బంధువులు పెళ్లి నిశ్చయించారు. ఐశ్వర్య తండ్రి రామకృష్ణ మృతిచెందగా.. తల్లి సుజాత స్థానిక‌ బ్యాంకులో స్వీపర్ గా వర్క్ చేస్తుంది. అదే బ్యాంకు లో మేనేజర్ గా చేస్తున్న తిరుమలరావుతో ఐశ్వర్య ప్రేమ‌లో ప‌డింది.


అప్పటికే అతడికి పెళ్లయింది. అయితే తన భార్యకు పిల్లలు లేరని.. ఐశ్వర్యను రెండో భార్య‌గా చేసుకుంటానని చెప్పి తిరుమలరావు ఆమెతో అక్రమ సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఇంత‌లోనే తేజేశ్వర్ తో పెళ్లి ఫిక్స్ కావడంతో ఐశ్వర్య ఇల్లు వ‌దిలి ప్రియుడి వ‌ద్ద‌కు వెళ్లిపోయింది. కానీ అప్పటికే అతడికి పెళ్లి కావడం, కుటుంబీకులు అడ్డుచెప్పడంతో తిరుమ‌ల‌రావుతో క‌లిసి ఉండేందుకు వీలుకాలేదు. దాంతో తిరిగి వ‌చ్చేసిన ఐశ్వ‌ర్య తేజేశ్వ‌ర్‌నే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది.


వివాహం తర్వాత కర్నూలులోనే కాపురం పెడితే ప్రియుడుతో తన సంబంధాన్ని కొనసాగించవచ్చని ఐశ్వర్య మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే తేజేశ్వ‌ర్‌కు ఫోన్ చేసి పెళ్లి ఖర్చులు, కట్న కానుకలు తన తల్లి భరించ‌లేదనే తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు నమ్మబలికింది. అప్పటికే ఐశ్వర్యతో ప్రేమలో పడిపోయి, ఆమెతో జీవితాన్ని ఊహించుకున్న తేజేశ్వర్ ఆ మాటల‌ను గుడ్డిగా నమ్మాడు. ఇంట్లో తల్లిదండ్రులు వ‌ద్ద‌ని ఎంత‌ చెబుతున్నా వినకుండా మే 18న ఐశ్వ‌ర్య‌తో పెళ్లిని ఫిక్స్ చేయించుకున్నాడు. గద్వాల జిల్లాలోని బీచ్‌పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పైసా కట్నం తీసుకోకుండా ఐశ్వ‌ర్య‌తో తేజేశ్వ‌ర్ ఏడ‌డుగులు వేశాడు. కుటుంబ సభ్యులు దగ్గరుండి వివాహం జరిపించారు.


కానీ పెళ్లి తర్వాత తేజేశ్వర గద్వాల్ లోనే కాపురం పెట్ట‌డంతో ప్రియుడ్ని కలుసుకోవడం ఐశ్వర్య కు కష్టంగా మారిపోయింది. ఎలాగైనా అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను తప్పించాలని నిర్ణయించుకుంది. విష‌యం ప్రియుడు తిరుమలరావుకు చెప్పగా అతను కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్ తో తేజేశ్వ‌ర్‌ను చంపించేందుకు దీల్ కుదుర్చుకున్నాడు. ఈనెల 17న సపారీ గ్యాంగ్ భూమి సర్వే చేయాల్సి ఉందని మాయ మాట‌లు చెప్పి తేజేశ్వర్ ను కారులో తీసుకెళ్లారు. గద్వాల మండలం వీరపురం కృష్ణస్వామి ఆలయం సమీపంలో మారణాయుధాలతో పొడిచి కారులోనే తేజేశ్వ‌ర్ ను చంపేశారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి మీదగా గుర్రంగడ్డ వ‌ద్ద నేష‌న‌ల్ హైవేలో యూటర్న్ తీసుకుని కృష్ణా నదిలో ఆయుధాలను, తేజేశ్వర్ కు సంబంధించిన లాప్‌టాప్‌, సెల్ ఫోన్లు పడేశారు.


తిరుమలరావు తేజేశ్వ‌ర్ మ‌ర‌ణాన్ని క‌న్ఫామ్ చేసుకున్నాక‌.. సుపారీ గ్యాంగ్ మృత‌దేశాన్ని నంద్యాల‌కు ద‌గ్గ‌ర్లోని పాణ్యం అట‌వీ ప్రాంతంలో ర‌హ‌దారి ప‌క్క‌న మృత‌దేహాన్ని ప‌డేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అలాగే పెళ్లయిన 29 రోజుల్లో ఐశ్వర్య దాదాపు 15 రోజులు కర్నూలులోనే ఉన్నట్టు తెలిసింది. పోలీసులు అనుమానంతో ఆమె కాల్ డేటాను చెక్ చేయగా గ‌త నాలుగు నెల‌ల్లో భర్తకు 120 సార్లు కాల్ చేసిన ఐశ్వర్య.. కర్నూలుకు చెందిన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు ఏకంగా 2,200 కాల్స్, వంద‌ల మెసేజెస్‌ చేసిన‌ట్లు గుర్తించారు. ఇక ఐశ్వ‌ర్య త‌ల్లి సుజాత‌తో కూడా తిరుమ‌ల‌రావు సంబంధం పెట్టుకుని ఉండ‌టం గ‌మ‌నార్హం. కాగా, తేజేశ్వ‌ర్ మ‌ర్డ‌ర్ కేసులో ఇప్ప‌టికే పోలీసులు ఐశ్వ‌ర్య‌, ఆమె త‌ల్లి సుజాత‌, తిరుమ‌ల‌రావు మ‌రియు సుపారీ గ్యాంగ్‌లోని ఇద్ద‌రు వ్య‌క్తులు, డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం అన్ని కోణాల్లోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: