బాపట్ల జిల్లా చుండూరు మండలంలో ఈనెల 21న సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే.. ఇందుకు ఏర్పాట్లు చేయడానికి జిల్లా అధికారులు నిధుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఓ ప్రముఖ పత్రిక కథనం రాసింది. ఏ ప్రభుత్వ శాఖలోనూ మిగులు నిధులు లేకపోవడంతో ప్రతి మండలం నుంచి లక్ష చొప్పున సమీకరిస్తున్నారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. నగదు సేకరణను ఓ ప్రధానశాఖకు చెందిన జిల్లా అధికారికి అప్పగించారట.


సీఎం జగన్  పుట్టినరోజున సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయడానికి ఈనెల 21న చుండూరు మండలం యడ్లపల్లి ఏవీఆర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఆయన వస్తున్నారు. అయితే.. ఈ సభ ఏర్పాట్లకు, భోజన వసతి, కుర్చీలు, బారీకేడ్లు, వాహనాలకు లక్షల్లో నిధులు అవసరం కాబట్టి ఆ నిధుల సేకరణలో అధికారులు ఉన్నారట. బాపట్ల జిల్లా అధికారుల కార్యాలయాల్లో  స్టేషనరీ కొనుగోలుకు  నిధుల్లేకపోవడమే ఇందుకు కారణమని.. అధికారులు, ఉద్యోగులు సొంత సొమ్ముతో నిధులు సమకూర్చుకుంటున్నారని ఆ పత్రిక రాసింది.


నాలుగు నెలల క్రితం విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం వచ్చినప్పుడు కూడా అధికారులు అప్పుడూ ఇలానే నానా తంటాలు పడి చేతి చమురు వదిలించుకున్నారని ఆ పత్రిక రాసింది. ఐతే 21న సీఎం కార్యక్రమం కోసం మళ్లీ నిధులు సమీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని.. ఆదేశాలు సరే ఇప్పుడు సొమ్ములు తెచ్చేదెలా అని స్థానిక అధికారులు నసుగుతున్నారని సదరు పత్రిక రాసింది.  సీఎం వస్తున్నా మాపై బాదుడు తప్పదా అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆ పత్రిక వాపోయింది.


అయితే.. ఈ కథనం ఎంత వరకూ నిజం అన్నది కూడా ఓసారి పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే సదరు పత్రిక కొన్నాళ్లుగా ఏపీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ వరుస కథనాలు ప్రచురిస్తోంది. అదే నిజమైతే జగన్ జాగ్రత్త పడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: