ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో రాజధాని అంశాన్ని తేల్చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలి రోజు నుంచే తొలి రోజు నుంచే ఏపీ ఉభయ సభల్లో వాడీ వేడీ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభల్లో కీలక చర్చ సాగే అవకాశం ఉంది. మొదట మృతి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు.


బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల పనిదినాలు, అజెండా ఖరారు చేస్తారు. తొలిరోజే మూడు రాజధానులపై అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ నిర్వహించే అవకాశం ఉంది. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ సవాల్‌ చేసిన దృష్ట్యా మూడు రాజధానుల అంశంపై రచ్చ జరిగే అవకాశం ఉంది.


అయితే.. వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటున్న ప్రభుత్వం... ఈ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టి నెగ్గించుకునే అవకాశం ఉంది. ఉభయ సభల్లో జరిగే ప్రశ్నోత్తరాల్లో కీలక అంశాలపై చర్చ  జరిగే అవకాశం ఉంది. ఆర్బీకేలు, ఖరీఫ్‌ పంటనష్ట పరిహరం, ఎస్సీ విద్యార్థుల స్టడీ సర్కిళ్లు, ప్రమాదకర స్థితిలో శ్రీశైలం ప్రాజెక్టు, గిరిజన సహకార సంఘాలు, రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు, రజకులు-దర్జీలు-నాయీ బ్రహ్మాణులకు ఆర్థిక సాయం, పీఎంజీఎస్‌వై బిల్లుల చెల్లింపు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, విదేశీ విద్యా దీవెన పథకం వంటి అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగే అవకాశం ఉంది.


అటు మండలిలో ప్రశ్నోత్తరాలు సమయంలో పారిశ్రామిక హబ్‌లు, నిత్యావసరాల ధరలు, ఓడరేవులు, ఫిషింగ్‌ హర్బర్లు, ఆరోగ్య శ్రీ బిల్లులు, నరేగా పనుల పురోగతి, గండికోట నిర్వాసితుల ఆర్‌ అండ్‌ ఆర్‌, డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు, భూముల మార్పిడి, వైద్య సదుపాయాలు, అంగన్‌వాడీ, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: