![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/tdpa18f1460-6a9f-43c8-878e-4c9f650cd4f9-415x250.jpg)
రాజకీయ సమరంలో ప్రత్యర్థులను మానసికంగా.. భౌతికంగా దెబ్బకొట్టేందుకు సోషల్ మీడియా సైన్యాన్ని ప్రయోగిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వింగ్ ఉంది. దీని కోసం కొంత మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిని సోషల్ మీడియా వారియర్లుగా పిలుచుకుంటున్నారు. ఇక వీరు చేసే పని ప్రత్యర్థి పార్టీలను విమర్శించడం.. వారి విధానాలను ఎండగట్టడం ఆ పార్టీ ముఖ్య నాయకులు చేసే పనుల్లో తప్పులు పట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయడం.
ఎన్నికల సమయంలో వీరిని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు కీలకంగా ఉపయోగించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ తమ సోషల్ మీడియా విభాగానికి జీతాలు ఇవ్వలేదని..వారిని వదిలేశారనే ప్రచారాన్ని టీడీపీ అందుకుంది. అయితే ఇప్పుడు మరో సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్లకు ఆ పార్టీ సరైన జీతం ఇవ్వలేదని కొంత మంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు అనే ఫోన్ కాల్స్ అందరికీ వచ్చే ఉంటాయి. ఇలా ఫోన్ చేసిన వారికి సరైన జీతం ఇవ్వకుండా టీడీపీ మోసం చేసిందని కొంతమంది అదే సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకి రూ.12 వేలు జీతం ఇస్తామని చెప్పి కొంతమందికి టీడీపీ కాల్ సెంటర్ బాధ్యతను అప్పజెప్పింది. రోజుకి 5-6 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టి ఆ పని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు రూ.3 వేలు ఇచ్చి ఉద్యోగం నుంచి తీసివేసి వెళ్లిపొమ్మని చెప్పారంట. మేం టీడీపీని నమ్మి మోసపోయామని.. మాకు న్యాయం చేయాలని కొంతమంది ఉద్యోగులు వైసీపీ అనుకూల పత్రిక దగ్గరికి వచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఈ అంశాన్ని తీసుకొని తెగ ట్రోల్ చేస్తున్నారు.