ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2025వ సంవత్సరం ఒక సరికొత్త రాజకీయ నినాదానికి వేదికైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కేవలం ఐదేళ్ల పాలనపైనే దృష్టి పెట్టినట్లు కనిపించినా, కాలక్రమేణా ఆ వ్యూహం మారింది. ఇప్పుడు కూటమి నేతల నోట వినిపిస్తున్న ఏకైక తారకమంత్రం 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం. 2024 ఎన్నికల తర్వాత మొదటి ఆరు నెలల వరకు కూటమి మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని విస్తృతంగా ప్రచారం చేసింది. క్షేత్రస్థాయిలో టీడీపీ మరియు జనసేన కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల తలెత్తిన ఘర్షణలను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది.


ఈ విమర్శలకు చెక్ పెట్టడానికి, 2025 జూన్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ సదస్సులో పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఈ '15 ఏళ్ల మంత్రాన్ని' బయటకు తీశారు. "ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఈ కూటమి మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగుతుంది" అని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ ఎత్తుకున్న‌ ఈ నినాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ వెంటనే అందిపుచ్చుకున్నారు.
క్షేత్రస్థాయిలో విభేదాలకు తావులేదని, కలిసి ఉండకపోతే ఇరు పార్టీల నేతలకు నష్టమని అధిష్టానం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.


రాబోయే మూడు ఎన్నికల వరకు (15 ఏళ్లు) ఈ పొత్తు కొనసాగుతుందని చెప్పడం ద్వారా అటు పెట్టుబడిదారులకు, ఇటు ప్రజలకు ఒక రకమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారికంగా బీజేపీ ఈ 15 ఏళ్ల నినాదంపై ప్రకటనలు చేయకపోయినా, దక్షిణాదిలో బలం పుంజుకోవాలనే వ్యూహంతో ఉన్న ఆ పార్టీ కూడా ఈ సుదీర్ఘ ప్రయాణానికి సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.


వైసీపీ విమర్శలకు విరుగుడు :
వైసీపీ చేస్తున్న "కూటమి విచ్ఛిన్నం" అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ తారకమంత్రం ఒక కవచంలా పనిచేసింది. ప్రభుత్వం కేవలం ప్రస్తుత సమస్యల మీదనే కాకుండా, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టి పెట్టిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి సక్సెస్ అయ్యింది. 2025లో ఏపీ రాజకీయ ముఖచిత్రం గమనిస్తే, కూటమిలోని పార్టీల మధ్య ఉన్న ఐక్యత కేవలం ఎన్నికలకే పరిమితం కాదని, అది ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని స్పష్టమవుతోంది. "15 ఏళ్ల కూటమి ప్రభుత్వం" అనే నినాదం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: