పేదరికం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేని అమ్మాయిలను ఆర్థికంగా ఆదుకొని.. ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ.. సంతూర్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది. తాజాగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసిన అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ కలిసి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ తోడ్పాటుతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.

అర్హతలు:

* పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివుండాలి.

* ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

* 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి.

* 2020-21లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి.

* కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.

* హ్యుమానిటీస్, లిబరల్‌ ఆర్ట్స్, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది.

* అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: