ఆకు కూరలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలు ప్రకృతిలో లభించే పోషక పదార్థాలు. ఆకుకూరలు శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తుంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసే ప్రత్యేక లక్షణం ఈ ఆకుకూరల సొంతం. అయితే వాటిలో అతి ముఖ్యమైన ఆకుకూరలు.. వాటి పోషక విలువలు ఇప్పుడు తెలుసుకుందాం..
తోటకూర- దీనిలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాక ఎముకలకు బలాన్నిస్తుంది. రక్తకణాల ఆరోగ్యానికి ఉపయోగ పడుతుంది.
పాలకూర- దీనిలో విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకా ఎముకల సాంద్రతకు కూడా బాగా ఉపయోగపడుతుంది
పుదీనా ఆకు- గుండెకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల నివారణకు పుదీనా బాగా పని చేస్తుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా పాత్ర కీలకం. అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది.
పొన్నగంటి కూర- దీనిలో విటమిన్ ఎ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం, వాంతి , అరుచి వీనిని పోగొడుతుంది. అంతేకాక ఎముకల బలాన్ని పెంచి మనిషి దృఢంగా అయ్యేట్టు చేస్తుంది.
మునగాకు- దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఆషాడ మాసంలో మునగాకు కూర తినవలెను అని పెద్దలు చెపుతారు. మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
కరివేపాకు- మనం తినేటపుడు కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తాం. కానీ ఆ కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిలో బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు, అరుగుదల ఉపయోగపడుతుంది. కంటి సమస్యలకు కూడా కరివేపాకు బాగా పని చేస్తుంది.