మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఇండస్ట్రీలో సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. తనకు తెలిసి ఎవరు కష్టంలో ఉన్నా.. వెంటనే మెగాస్టార్ వారికి చేయూత అందిస్తారు. తాజాగా మరోసారి మెగాస్టార్ తన గొప్పమనసు చాటుకున్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్‌ భూషణ్‌కు రూ.50వేల ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్‌ భూషణ్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్‌ బ్యాంక్‌ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. తానెంతో రుణపడి ఉంటానని భరత్‌ భూషణ్‌ అన్నారు.

కాగా.. చిరంజీవి ఈ మధ్యనే తమిళ నటుడు పొన్నాంబళానికి కూడా ఆర్థికంగా సాయం అందించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నాంబళం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తనకు సాయం చేయాలని కొంతకాలం క్రితం ఆయన సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు. అయితే ఇటీవలే పొన్నాంబళం పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి ఆయన ఆపరేషన్‌కు కావలసిన మొత్తాన్ని అందించారు. రూ.2లక్షల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. దీంతో పొన్నాంబళం సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నా నువ్వు చేసిన సాయం మర్చిపోలేను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక అంతకుముందు సీనియర్ నటి పావలా శ్యామలకు కూడా మెగాస్టార్ అండగా నిలిచారు. వయసు మీద పడడంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామలకు జూనియర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి ఆర్థిక సాయం అందిస్తూ ఈ మధ్యన ఆన్‌లైన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ విషయం వైరలైంది. ఈ సందర్భంలోనే మెగాస్టార్‌కు కూడా పావలా శ్యామల పరిస్థితి తెలిసింది. వెంటనే ఆమెకు సాయం చేసేందుకు మెగాస్టార్ ముందుకొచ్చారు. ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. నెలనెలా ఆమెకు పెన్షన్ కూడా అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆయన క్యారవ్యాన్ డ్రైవర్ మరణిస్తే.. ఆయన కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారు. అలాగే ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమందికి ఆయన ఆర్థికంగా అండగా నిలిచారు. మానసికంగా ప్రోత్సాహాన్నిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: