బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి వెండి తెర స్థాయికి ఎదిగింది నటి, యాంకర్‌ అనసూయ. జబర్ధస్త్‌ షోతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ అనంతరం సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై కూడా తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ యాంకర్‌.

సుకుమార్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించింది ఈ భామ. కేవలం గ్లామర్‌ పాత్రలకే కాదు.. తనలో ఒక మంచి నటి కూడా ఉందని చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన ‘విన్నర్‌’ చిత్రంలో తొలిసారి ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించి మార్కులు కొట్టేసిందీ బ్యూటీ.

ఇక ఇటీవల తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ‘పైన పటారం.. లోన లొటారం’ అంటూ కుర్రకారు మతులు పొగొట్టిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈ అందాల తార తాజాగా మరో స్పెషల్‌ సాంగ్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా కనిపిస్తుండగా అదితి రావు హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో అనసూయను నటింపజేయాలని డైరెక్టర్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనసూయను సంప్రదించగా ఓకే కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మొదట పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. మరి అనసూయ నిజంగానే ఇందులో స్పెషల్‌ సాంగ్‌ చేయనుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: