టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్టుల వర్షం కురిపించాయి. కానీ ఆ ట్రెండ్ నెమ్మదిగా తగ్గిపోయింది. హీరోల ఎంట్రీలు, పంచ్ డైలాగులు, ఎలివేషన్లు అన్నీ బాక్సాఫీస్‌పై ఆధిపత్యం చెలాయిస్తుండటంతో నాయికా ప్రాధాన్యం ఉన్న కథలకు చోటు తగ్గింది. దర్శకులు, నిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మానేశారు. అయినా ప్రేక్షకులు అటువంటి కథలు మన్నిస్తారని, హిట్ చేస్తారని అరుంధతి, భాగమతి లాంటి చిత్రాలు అప్పుడే నిరూపించాయి. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వచ్చిన ‘పరదా’ కూడా అదే ప్రయత్నం చేసింది. "హీరోలకే కాదు, హీరోయిన్లకూ విజిల్స్ పడాలి" అనే సందేశంతో తెరపైకి వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్ అయ్యుంటే, టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ జోనర్‌కు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉండేది. కానీ ఆ కల మళ్లీ వాయిదా పడింది.


ఇక ఇప్పుడు ఫోకస్ అంతా అనుష్క శెట్టి వైపు తిరిగింది. 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లు ఇచ్చిన స్వీటీ, మళ్లీ లేడీ ఓరియెంటెడ్ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే ‘ఘాటీ’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుష్కను మాస్ హీరో రేంజ్లో చూపించబోతుందనే టాక్ మొదలైంది. అలా చూపించగల స్టామినా ఉన్న హీరోయిన్లలో ప్రస్తుతం అనుష్క మాత్రమే కనిపిస్తోంది. ఇది కేవలం అనుష్కకు మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ కథల నిర్మాణానికి కూడా కీలక పరీక్ష. "ఘాటీ" హిట్టయితే, నిర్మాతలు, రచయితలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మళ్లీ దృష్టి సారించే అవకాశం ఉంది. సాయి పల్లవి, సమంత, తమన్నా, అనుపమ వంటి హీరోయిన్స్‌కూ బలమైన పాత్రలు రాసే ధైర్యం వస్తుంది.



‘అరుంధతి’ ఒక్క సినిమానే ఆ కాలంలో ఇండస్ట్రీలో ట్రెండ్ మార్చేసింది. "ఘాటీ" కూడా అలాంటి ఇంపాక్ట్ ఇవ్వగలదనే ఆసక్తి ఉంది. భాగమతి కూడా తన కాలంలో అనూహ్యమైన వసూళ్లు అందించింది. ఈసారి కూడా మంచి కంటెంట్‌తో వస్తున్న "ఘాటీ" కనీసం ఆ స్థాయి రేంజ్‌లో రాణిస్తే సరిపోతుంది. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒకసారి తిరిగి జోరు అందుకుంటే, టాలీవుడ్ కంటెంట్‌లో డైవర్సిటీ పెరుగుతుంది. మాస్ స్టైల్‌లో హీరోయిన్ ఎంట్రీకి థియేటర్లు కేకలు వేస్తే… అది కొత్త ట్రెండ్‌కి నాంది అవుతుంది. అందుకే అందరి కళ్ళూ ఇప్పుడు ఒకే ప్రశ్నపై ఉన్నాయి – “అనుష్క ఘాటీతో లేడీ ఓరియెంటెడ్ జానర్‌ని మళ్లీ బ్రతికిస్తుందా?”

మరింత సమాచారం తెలుసుకోండి: