తేజ సజ్జా హీరోగా నటించిన తాజా మూవీ మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేవలం ఐదు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా, సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో ఆకట్టుకున్నారు. జగపతి బాబు, జయరాం, గెటప్ శీను, సంజయ్ కపూర్, రఘురామ్ తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. అయితే మిరాయ్‌లో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉంది. అదేంటంటే… ఈ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ డైరెక్టర్లు నటులుగా కనిపించడం. అవును! నేను శైలజా, చిత్రలహరి, రెడ్ వంటి హిట్ సినిమాల దర్శకుడు కిశోర్ తిరుమల మరియు కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన వెంకటేష్ మహా ఇద్దరూ ఈ సినిమాలో కనిపించారు.

కిశోర్ తిరుమల సీఐ అశోక్ పాత్రలో, వెంకటేష్ మహా అతని బాస్‌గా స్క్రీన్‌పై మెరిశారు. ముఖ్యంగా కిశోర్ తిరుమల పాత్రలోని ఫన్నీ ఫియర్ యాక్టింగ్ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. సాధారణంగా చాలా సీరియస్‌గా కనిపించే ఈ డైరెక్టర్ స్క్రీన్ మీద డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్‌తో థియేటర్‌లో హాస్య వాతావరణం క్రియేట్ చేశాడు. తెలుసా? కిశోర్ తిరుమల డైరెక్టర్‌గా మారకముందే సినిమాలకు మాటలు, పాటలు రాశాడు. సెకండ్ హ్యాండ్, పవర్, కరెంట్ తీగ, శివమ్ వంటి సినిమాలకు ఆయన రాసిన డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి. ‘నేను శైలజా’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆయన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. తరువాత ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి సినిమాలతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

మరోవైపు వెంకటేష్ మహా ‘కేరాఫ్ కంచరపాలెం’తో ఒక్కసారిగా నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆయన సినిమాకు వచ్చిన క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంది. డైరెక్టర్‌గా మాత్రమే కాదు, నటుడిగా కూడా తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో కనిపిస్తూ తనదైన స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. మిరాయ్‌లో ఈ ఇద్దరు డైరెక్టర్లు స్క్రీన్ మీద కనిపించటం నిజంగా స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ఆడియెన్స్ కూడా వారిని చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ముఖ్యంగా కిశోర్ తిరుమల కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అవ్వడంతో, “ఇదో కొత్త కామెడీ స్టార్ పుట్టాడేమో” అన్నట్టుగా థియేటర్లలో రియాక్షన్లు వచ్చాయి. మొత్తానికి తేజ సజ్జా మిరాయ్‌తో బ్లాక్‌బస్టర్ కొడుతుంటే, ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి ఇద్దరు డైరెక్టర్లు నటులుగా కూడా మనసులు గెలిచారని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: