మాస్ మహారాజా రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మాస్ జాతర'. మాస్, ఫన్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయి, 'యు/ఏ' సర్టిఫికెట్‌ను అందుకుంది. రన్ టైమ్ సుమారు 2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు) గా ఖరారైంది.

అయితే, అదే రోజున దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ కానుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా 3 గంటల 45 నిమిషాల భారీ రన్ టైంతో విడుదల చేయనున్నారు. ఈ రీరిలీజ్‌కు అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో, 'బాహుబలి: ది ఎపిక్'కు పోటీ ఇవ్వడం కష్టమని భావించి, 'మాస్ జాతర' సినిమాను ఒకరోజు పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అంటే, ఈ సినిమా నవంబర్ 1వ తేదీన విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే, అక్టోబర్ 31 రాత్రి రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

మరోవైపు, 'మాస్ జాతర' సినిమా ట్రైలర్ ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ట్రైలర్‌తో పాటే సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా చిత్ర బృందం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వరుసగా ఆశించిన స్థాయిలో హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ సినిమా విజయం చాలా కీలకం. అందుకే 'మాస్ జాతర' బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని, భారీ విజయం సాధించాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే, ఈ క్లాష్ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: