అందం మాత్రమే కాదు, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ మన దక్షిణాది సినీ పరిశ్రమలో చాలా అరుదు. అటువంటి అరుదైన నటీమణుల్లో ఒకరు ప్రియమణి. గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, సహజమైన నటనతో కూడిన పర్ ఫామెన్స్  ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకోవడం విశేషం.ప్రియమణి సినిమాల్లో కనిపించిన ప్రతీసారి పాత్రలో పూర్తిగా లీనమై, ప్రేక్షకులు ఆ పాత్రను నమ్మేలా నటించడం ఆమెకు ప్రత్యేకమైన బలం. అందాలను ఆరబోయడమే కాకుండా, కథకు ప్రాణం పోసే నటనతో ఆమె ఎన్నో పాత్రలను చిరస్థాయిగా నిలిపింది. అతి తక్కువ కాలంలోనే పలు భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఒక దశలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది.

అయితే ఇటీవల కాలంలో ప్రియమణి వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. గతంలో కొన్ని టెలివిజన్ షోలలో న్యాయనిర్ణేతగా సందడి చేసిన ఆమె, ఇప్పుడు అక్కడ కూడా కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. “ఇంత గొప్ప నటి ఇలా ఖాళీగా ఉండడం ఏమిటి?”, “హీరోయిన్ పాత్రలు కాకపోయినా బలమైన క్యారెక్టర్ రోల్స్ అయినా చేయొచ్చు కదా” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రియమణి చివరిసారిగా కనిపించిన చిత్రం ‘కస్టడీ’. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె నెగటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆమె ఎలాంటి సినిమాకు సైన్ చేయకపోవడం గమనార్హం. దీంతో ఆమె సినీ ప్రయాణం మందగించిందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఇలాంటి సమయంలో ప్రియమణి అభిమానులకు శుభవార్త లాంటి సమాచారం బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ప్రియమణికి ఒక బంపర్ ఆఫర్ దక్కినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం.ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే చిత్ర బృందం ఆమెను సంప్రదించగా, కథ మరియు పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి కొంత ఓల్డ్ ఏజ్ గెటప్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రియమణి పాత్రకు కూడా మంచి నటనకు స్కోప్ ఉన్న బలమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట.

ఈ పాత్ర కోసం మొదటగా పలువురు ప్రముఖ నటీమణులను సంప్రదించినట్లు సమాచారం. ముందుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను అడిగినా ఆమె ఒప్పుకోలేదట. ఆ తర్వాత రాణీ ముఖర్జీ, అనుష్క శెట్టి వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. కానీ పలు కారణాల వల్ల అవి వర్కౌట్ కాలేదు. చివరికి నటనకు పూర్తి న్యాయం చేయగల ప్రియమణినే ఫైనల్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారట. అలాగే యంగ్ హీరోయిన్ కృతి శెట్టి మెగాస్టార్ చిరంజీవికి కూతురు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్యాస్టింగ్ వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిందని తెలుస్తోంది. ‘జన నాయగన్’ సినిమాకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు పరిష్కార దశలో ఉన్నాయని, మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి మళ్లీ ఒక భారీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రతో ఆమె మరోసారి తన ప్రతిభను నిరూపిస్తుందనే ఆశ అభిమానుల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: