లండన్ లో నివసిస్తున్న ఇద్దరు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా.. వేలాది మంది స్థానిక ప్రజలు, ఎన్నారైలు పోలీసులపై దండెత్తారు. అరెస్టు చేయడానికి ఏమాత్రం వీలు లేదని భారీ ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. వేలాది మంది జనం అనూహ్య రీతిలో పోటెత్తడంతో భయపడిపోయిన అధికారులు, పోలీసులు వెంటనే ఆ ఇద్దరు ఎన్నారైలను విడిచిపెట్టారు. అయితే ఇద్దరు ఎన్నారైల కోసం వేలాదిమంది పోటెత్తగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.. సుమిత్ సహదేవ్ అనే ఒక భారతీయుడు ఇంగ్లాండ్ లో గత 10 సంవత్సరాలుగా వంట మనిషి గా పని చేస్తున్నాడు. మరొక ఎన్ఆర్ఐ లఖ్వీర్ సింగ్ మెకానిక్ గా పనిచేస్తూ యూకేలోనే 10 సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయితే సుమిత్, లఖ్వీర్ యూకేలో అక్రమంగా నివసిస్తున్నారనే అభియోగాలు వచ్చాయి. దీనితో యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు స్కాట్లాండ్ పోలీసులతో కలిసి గురువారం రోజు అనగా మే 13న గ్లాస్గోలోని పోలోక్‌షీల్డ్స్ ప్రాంతంలో నివసిస్తున్న సుమిత్, లఖ్వీర్ అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. తర్వాత నిర్భంధ కేంద్రానికి తరలిస్తుండగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి పోటెత్తారు. వాళ్ళిద్దర్నీ విడిచిపెట్టాలి అంటూ వేలాది మంది ప్రజలు పోలీస్ వ్యాన్‌ను అడ్డగించారు.



అయితే వీరిలో పాకిస్థాన్‌కు చెందిన అమీర్ అన్వర్ అనే ఓ లాయర్ కూడా ఉండటం విశేషం. అయితే అరెస్టు చేసిన భారతీయులను విడుదల చేయాలని నిరసన కారులు సుమారు 8 గంటలపాటు ఆందోళనలు చేపట్టారు. దీనితో ఇక చేసేదేమీలేక ఇంగ్లాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు సుమిత్, లఖ్వీర్ సింగ్‌లను విడిచిపెట్టారు.

పాకిస్తాన్ కి చెందిన న్యాయవాది అమీర్ అన్వర్ మీడియాతో మాట్లాడుతూ.. శరణార్థుల రక్తం, స్వేదంతోనే గ్లాస్గో నగరం నిర్మితమైందని.. అందుకే వారి కోసం నిరసనలు చేయడానికి నడుం బిగించామని చెప్పుకొచ్చారు. పోలీసుల నుంచి విడుదలైన సుమిత్, లఖ్వీర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడారు. తమకు మద్దతుగా నిలిచిన వేలాది మంది ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇకపోతే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఒక మహిళా రాజకీయ నేత ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: