ప్రధానమంత్రి నరేంద్రమోడియే ఏపి అభివృద్ధిని అడ్డుకుంటున్నారా ? చంద్రబాబునాయుడు మాటలు చాలా విచిత్రంగా ఉంటోంది. మోడితో విభేదించటం వల్లే ఏపి అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు మండిపడ్డారు. విషయం ఏమిటంటే, కేంద్రం సహకరించకపోయినా ఏపి అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని ఇదే చంద్రబాబు ఎన్నో వేదికల మీద ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. పెట్టుబడుల సదస్సుల్లోను, విదేశీ పర్యటనల్లోను ఏపి అభివృద్ధి చెందుతోందని చెబుతున్న చంద్రబాబు శాసనమండలిలో మాత్రం ఏపి అభివృద్ధిని మోడి అడ్డుకుంటున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. పైగా రాష్ట్ర అవసరాలను తీర్చలేని ఢిల్లీ ప్రభుత్వానికి, అప్పటి బ్రిటీష్ పాలనకు ఏమీ తేడాలేదని చెప్పటం చూస్తుంటే పరాయిపాలనైన బ్రిటీష్ ప్రభుత్వమే నయం అన్నట్లుంది.
ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపిలో నిర్మించేందుకు సహకరిస్తామని అప్పట్లో నరేంద్రమోడి చెప్పారని ఇపుడు చంద్రబాబు మండిపడ్డారు. అయితే, అదే సమయంలో అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఢిల్లీని తలదన్నే రాజధాని ఏపికి ఇపుడు అవసరమే లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఏపి అవసరాలేంటి ? ఆర్దిక పరిస్ధితేంటి అన్నది దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేయాలని స్పష్టంగా చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు నాయకత్వ లక్షణాలే లేవని చంద్రబాబు కొత్త పాయింట్ లేవదీశారు. నిజానికి నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి ? బిజెపి నేతలను కృష్ణానదిలో ముంచితే పాపపు ఆలోచనలు పోతాయనటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, బిజెపి నేతలను కృష్ణానదిలో ముంచటం సంగతి దేవుడెరుగు. ఇప్పటికే కృష్ణా నదితో పాటు గోదావరి నదిలో కూడా చంద్రబాబు ముణిగారు కదా ? మరి ఆయన ఆలోచనల్లో ఏమీ మార్పు కనబడటం లేదే ?