ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో జగన్ పై సీబీఐ అనేక కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జగన్ దాదాపు 16 నెలలపాటు జైల్లో ఉన్నారు కూడా. అయితే దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో జగన్ ను జైల్లో పెట్టించేందుకు టీడీపీకి కొందరు అధికారులు సహకరించారా.. వారి సహకారంతోనే అప్పట్లో జగన్ ను వేధించారా..? ఆ అధికారుల కారణంగానే జగన్ పై అవినీతి ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారా..అంటే అవునంటున్నారు వైసీపీ నాయకులు.
ఇంతకీ ఆ అధికారులు ఎవరు.. ఈ విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు వివరిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఓ ప్రెస్ మీట్ పెట్టి ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ ను జగన్ కక్షసాధింపు కోసమే సస్పెండ్ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు... పాత విషయాలను గుర్తు చేశారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయకుండా.. సన్మానాలు చేస్తారా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబును ప్రశ్నించారు.
పరిశ్రమ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా జాస్తి కృష్ణకిషోర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపడం కొత్తేమీ కాదన్నారు. జాస్తి కిషోర్, జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్యచౌదరి వీళ్లందరినీ తన కనుసన్నల్లో పనిచేసే విధంగా చంద్రబాబు చేసుకున్నారు కాబట్టే ఆ రోజున వైయస్ జగన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత వైయస్ జగన్పై కేసులు రావడానికి కారణం ఎవరూ.. 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టించింది మీరు కాదా చంద్రబాబూ..? అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.
అప్పట్లో ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారంటే.. వైయస్ జగన్ ఓదార్పుయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకొని హైకమాండ్ను కాదని యాత్రకు వెళ్తుంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సోనియాగాంధీతో చేతులు కలిపి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పరియావసానమే ఈ జగతి పబ్లికేషన్ కేసులు, వైయస్ జగన్ జైలుకు వెళ్లడం, ఆ రోజున సోనియాగాంధీతో కలిసి పనిచేసిన దుర్మార్గపు రాజకీయ వేత్త నువ్వు కాదా చంద్రబాబూ..? అని పాత విషయాలు గుర్తు చేశారు అంబటి రాంబాబు.