తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏపీ నుంచి నాలుగు సీట్లు, తెలంగాణ నుంచి రెండు సీట్లు ఉన్నాయి. ఇక అందరి కళ్ళు విటిమీదనే ఉన్నాయి. అయితే.. ఏపీ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సీటు ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అన్నారు. రాజ్యసభ సీటు కోసమే జగన్ను కలిశామని చెప్పారట.
పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీ మాట్లాడుతూ.. నేను రాజ్యసభ సీటు కోరిన మాట నిజమేనని కానీ.. జగన్ మూడు రోజుల సమయం కావాలని కోరారని పరిమళ్ చెప్పారు. తనకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు దాదాపు ఖాయమైందని క్లారిటీ ఇచ్చారట.. ఓ బీజేపీ ఎంపీ, మరో వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. ఒకవేళ ఏపీ నుంచి అవకాశం దక్కకపోతే ప్రత్యామ్నాయాలపైనా ఫోకస్ పెట్టారట.
పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీ రాజ్యసభ సీటు ఇస్తారనే వార్తలతో వైఎస్సార్ సీపీలో ఆశావహుల్లో టెన్షన్ మొదలైందనే చెప్పాలి. ఈ రేసులో ఉన్న నేతలు తమకు సీటు దక్కుతుందో లేదోనని కంగారుపడిపోతున్నారట. వైఎస్సార్ సీపీ నుంచి రాజ్యసభ రేసులో వైవీ సుబ్బారెడ్డి, రాంకీ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవీ వెంకటరమణ, బీద మస్తాన్ రావుల పేర్లు ఉన్నాయి. వీరే కాదు ఒకనొక సమయంలో జగన్ సోదరి షర్మిల పేరు కూడా వినిపించింది. మరి జగన్ రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది చూడాలి.
పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీ 1990ల్లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. 1997లో ఆయన రిలయన్స్ గ్రూప్లో చేరారు. 2016 నాటికి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ముకేశ్తోనే కాదు ఆయన తండ్రి ధీరూభాయి అంబానీతోనూ నత్వానీ కలిసి పని చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోర్ లీడర్షిప్లో ఆయన కీలక సభ్యుడు. జామ్నగర్ రిఫైరీ కోసం పది వేల ఎకరాల భూమిని సేకరించడంలో ముఖ్యపాత్ర పోషించారు. రిలయన్స్ 4జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులోనూ నత్వానీ కీలక భూమిక పోషించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గానూ ఆయన బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు బీజేపీతోనూ సత్సంబంధాలు ఉన్నాయి.