నిర్భయ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఈ పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోయింది. చివరకు నిర్భయ పేరుతో ఓ చట్టం కూడా వచ్చింది. తరాలు మారినా దేశంలో ఎన్నో దారుణ సంఘటనలు జరిగినా కూడా నిర్భయ అనేది ఓ ప్రత్యేకమైన చరిత్రగా మన దేశ చరిత్రలో ఎప్పటకీ నిలిచి పోయి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక నిర్భయ అనే పేరు ఎలా వచ్చింది ? అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు ? అన్నది ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసు కోవాలి. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
నిర్భయ తో పాటు ఆమె మిత్రుడు కూడా ఈ బస్సులో ఎక్కారు. అప్పటికే రాత్రి 9. 30 గంటలు అవుతోంది. ఆమె పారా మెడికల్ విద్య అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మిత్రుడితో కలిసి ఇంటికి వెళుతోన్న సమయంలో ఈ దారుణం జరిగింది. మృగాళ్లు అందరూ కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ సింగపూర్ ఆసుపత్రిలో మృతి చెందింది.
ఇక ఈ దారుణ సంఘటనతో చలించి పోయిన దేశం అంతా ఆమెకు సపోర్టుగా కొవ్వొత్తులు చేతబూని రోడ్ల మీదకు వచ్చి ఘనమైన నివాళి అర్పించింది. నిర్భయ కుటుంబ విషయానికి వస్తే ఆమె తల్లి దండ్రులు ఉత్తర ప్రదేశ్లోని బాలియా జిల్లాకు చెందిన వారు. ఆమె ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. ఇక ఈ సంఘటన తర్వాత ఆమె అసలు పేరుతో కాకుండా ఆమెకు అమానత్, నిర్భయ, దామిని అనే పేర్లు పెట్టారు. చివరకు నిర్భయ పేరు స్థిరపడిపోయింది. ఆ పేరుతోనే చట్టం కూడా వచ్చింది.
ఇక ఈ కేసులో బస్సు డ్రైవర్ అయిన ప్రధాన నిందితుడు రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.